Ayodhya Reddy: పారదర్శకమైన, జవాబుదారీతనం గల పాలన అందించే లక్ష్యంతో రూపొందించబడిన సమాచార హక్కు చట్టాన్ని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు, సహాయ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై పీఐవో, అప్పిలెట్ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
Also Read: New RTI Commissioners: సమాచార హక్కు కమిషనర్ల ప్రమాణ స్వీకారం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా ఆర్టీఐ కమిషనర్ అయోధ్య రెడ్డి మాట్లాడుతూ… సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగిన వారిని దోషిగా చూడాల్సిన అవసరం లేదన్నారు. పాలనలో పారదర్శకత కోసమే 2005లో ఈ చట్టాన్ని తెచ్చారని, చట్టం ప్రకారం అడిగిన సమాచారాన్ని నిర్ణీత సమయంలో తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో 4(1)బి చార్ట్ను తప్పనిసరిగా ప్రదర్శించాలి. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించి, ఎటువంటి పెండింగ్ లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే తాము జిల్లాల పర్యటనలు చేస్తున్నామని, ఇప్పటివరకు 15 జిల్లాల్లో పర్యటించామని తెలిపారు. సెక్షన్ 6(1) కింద దరఖాస్తుదారుడు కోరిన సమాచారాన్ని అందించాలని సూచించారు.
ఆలస్యం లేకుండా
సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ… ఈ చట్టం పౌరులకు పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన అందించడంలో కీలకమైన సాధనమని తెలిపారు. పీఐవో అధికారులు ప్రజలకు సమయానికి, పూర్తి సమాచారాన్ని అందించాలని, ఆలస్యం కాకుండా చట్టంలో ఉన్న సమయపరిమితి లోపల సమాధానమివ్వాలని ఆదేశించారు. ప్రజలు చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. “ఆర్టీఐ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తే అవినీతి తగ్గిపోతుంది, ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుంది,” అని ఆయన అన్నారు.
సెక్షన్లపై పవర్ పాయింట్
కమిషనర్ మోసినా పర్వీన్ సమాచార హక్కు చట్టంలోని 6 చాప్టర్లు, 31 సెక్షన్ల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పీఐవో, ఏపీఐవోలకు క్షుణ్ణంగా వివరించారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ.. నిజాయితీగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలనే ఉద్దేశంతోనే కమిషన్ పని చేస్తుందన్నారు. ప్రతి అధికారి అవగాహన పెంచుకోవాలని, సమాచారం అడిగిన వ్యక్తికి నిర్దేశిత వ్యవధిలో కాకుండా ముందుగానే సమాచారం అందించాలని అధికారులను కోరారు. సమావేశం అనంతరం, కమిషనర్లు పెండింగ్లో ఉన్న ఆర్టీఐ దరఖాస్తులపై విచారణ నిర్వహించారు. సంబంధిత పీఐవో అధికారులు, దరఖాస్తుదారుల నుండి వివరాలు స్వీకరించి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ అవగాహన సదస్సులో సమాచార కమిషనర్లు దేశాల భూపాల్, పీవీ శ్రీనివాస్ రావు, మోసినా పర్వీన్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ అక్షాంక్ష్ యాదవ్, ఏసీపీ రాహుల్ రెడ్డితో పాటు అదనపు కలెక్టర్లు, ఆర్డీవో, డీఆర్ఓ, వివిధ శాఖల పీఐవోలు, ఏపీఐవోలు, అప్పిలెట్ అధికారులు పాల్గొన్నారు.
Also Read: Pawan Kalyan: ఓజీ రిలీజ్ సమయంలో తెర పైకి పవన్ డిజాస్టర్ మూవీ.. ఎక్కడో తేడా కొడుతోంది?
