Crop Loss: రాష్ట్రంలో మొంథా తుపాను బీభత్సం సృష్టించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు పంట నష్టంపై సర్వే చేశారు. అధికారంగా రాష్ట్రంలో 1,22,242 మంది రైతులకు చెందిన 1,17,757 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బ తిన్నాయని తెలిపారు. నష్టం వివరాలను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. తుపాను కారణంగా నష్టం వాటిల్లిన జిల్లాలలో పర్యటించిన అధికారుల బృందం, దెబ్బతిన్న పంటల వివరాలను, సర్వే చేసి నివేదికను తయారు చేశారు. అత్యధికంగా 83,407 ఎకరాలలో వరి, 30,144 ఎకరాల్లో పత్తి, 2,097 ఎకరాలలో మొక్కజొన్న నష్టం వాటిల్లింది. అత్యధికంగా నాగర్ కుర్నూల్ జిల్లాలో 23,580.06 ఎకరాల్లో, వరంగల్ జిల్లాలో 19,736.22 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పేర్కొన్నారు.
జిల్లాలవారీగా నష్టం వివరాలు
ఆదిలాబాద్లో 62.38 ఎకరాలు, హనుమకొండలో 11,310.10 ఎకరాలు, జగిత్యాలలో 1,157.16 ఎకరాలు, జనగామలో 8,457.04 ఎకరాల్లో పట్ట నష్టం జరిగింది. భూపాలపల్లి జిల్లాలో 481.25 ఎకరాలు, గద్వాల జిల్లాలో 12.16 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో 11,473.32 ఎకరాలు, ఖమ్మంలో 3,901.34 ఎకరాలు, ఆసిఫాబాద్లో 13.28 ఎకరాలు, మహబూబాబాద్లో 8,318.07 ఎకరాలు, మహబూబ్ నగర్ లో 463.36 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. మంచిర్యాలలో 570.15 ఎకరాలు, మెదక్లో 1,634.19 ఎకరాలు, మల్కాజ్గిరిలో 7.30 ఎకరాలు, నాగర్ కర్నూల్లో 23,580.06 ఎకరాలు, నల్లగొండలో 5,259.20 ఎకరాలు, నిర్మల్లో 252.23 ఎకరాలు, నిజామాబాద్లో 250.14 ఎకరాలు, రాజన్న సిరిసిల్లలో 55.03 ఎకరాలు, రంగారెడ్డిలో 316.26 ఎకరాలు, సంగారెడ్డిలో 4,858.01 ఎకరాలు, సిద్దిపేటలో 5,277.23 ఎకరాలు, సూర్యాపేటలో 7,476 ఎకరాలు, వికారాబాద్లో 523.35 ఎకరాలు, వనపర్తిలో 1,884.01 ఎకరాలు, వరంగల్లో 19,736.22 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 421.04 ఎకరాల్లో పంటనష్టం జరిగిందని అధికారులు ప్రకటించారు. మొత్తం రూ.117 కోట్ల 75లక్షల 72వేల పంట నష్టం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు.
Also Read: Fenugreek Seeds: రోజూ మెంతుల నీరు తాగడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
కేంద్రం నుంచి సాయం ఏది?
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్డీఆర్ఎఫ్(NDRF) కింద ఇసుక మేటలకు రూ.7,285 ఎకరానికి, నీటిపారుదల కింద సాగైన పంటలకు ఎకరానికి రూ.6,880, వర్షాధార పంటలకు రూ.3,440, తోటలకు ఎకరానికి రూ.9,106 చొప్పున మొత్తం రూ.70 కోట్ల నిధులు రాష్ట్రానికి ఇవ్వవలసి ఉన్నదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) తెలిపారు. గతంలో వరదలు సంభవించినప్పుడు కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సహాయం అందలేదని, ఈ పంట నష్టం వివరాలు కూడా కేంద్రానికి పంపి ఎన్డీఆర్ఎఫ్ కింద కేంద్రాన్ని నిధులు అడుగుతామని, ఇప్పటికే మొంథా తుపాను వలన జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపించాలని కోరామన్నారు. త్వరలోనే పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
Also Read: Delhi Blast: కీలక అనుమానితుడు డాక్టర్ ఉమర్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారో తెలుసా?
