Congress: గతంలో కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు ఫిరాయింపులపై మాట్లాడితే నవ్వొస్తున్నదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. శాసన సభలో భట్టికి ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది కేసీఆర్ కాదా? శాసనమండలిలో తన ప్రతిపక్ష హోదాను కేసీఆర్ తొలగించలేదా? అని నిలదీశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకుంది బీఆర్ఎస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు అనర్హత వేటు అంటూ వల్లిస్తున్నారని మండిపడ్డారు.
షబ్బీర్ అలీ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణను అంగడి బజారులో పెట్టారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి అమ్మకానికి పెట్టారని, పేద ప్రజల వైపు నిలబడలేదని చెప్పారు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖతమైనట్టే అని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం 11 ఎకరాల భూమి ఎందుకు అని ప్రభుత్వ విప్ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఆ భూమిని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు ఆఫీసు లేదని చెప్పారు. కోకాపేట్లో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఆ భూమిని వేలం వేసి వచ్చిన డబ్బులు రుణమాఫీకి వాడుకోవాలని సూచనలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఉన్న ఆఫీసు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే నని వివరించారు.