- టీ. కమలంలో మొదలైన ఆధిపత్య పోరు
- సీట్లు పెరగడంతో పెరిగిపోయిన ఇగోలు
- నలుగురైదుగురు ఎంపీలతో తంటాలు
- సెల్ఫీలు తీసుకోవడానికి సైతం భయపడుతున్న క్యాడర్
- రాష్ట్ర సారధ్య బాధ్యత తమకే ఇవ్వాలని పట్టుబడుతున్న సీనియర్లు
- కేవలం రెండు మాత్రమే మంత్రి పదవులతో సరిపుచ్చిన కేంద్రం
- స్థానిక ఎన్నికలలో కలిసి పనిచేస్తారని లేని గ్యారెంటీ
- కిషన్ రెడ్డి తీరుతో అసంతృప్తి తో ఉన్న నేతలు
Dominence war between bjp MP s serious against kishan reddy :
తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 8, పార్లమెంట్ ఎన్నికలలో 8 స్థానాలు దక్కించుకుని ఊపుమీద ఉన్న బీజేపీకి ఆ పార్టీలో గ్రూపుల లొల్లి పెద్ద తలనొప్పిగా మారింది అధిష్టానానికి. విచిత్రం ఏమిటంటే అసెంబ్లీలో ఓడిపోయిన కొందరు నేతలు అనూహ్యంగా ఎంపీ ఎన్నికలలో గెలుపొందారు. ఓటింగ్ శాతం కూడా గతంలో కన్నా బాగానే పెరిగింది. అంతలోనే ఆ పార్టీ క్యాడర్ కు కొందరు గెలిచిన నేతలతో ఇబ్బందులు వస్తున్నాయి. కొత్తగా ఎంపికైన ఎంపీలు, కేంద్ర మంత్రులతో క్షేత్ర స్థాయి కార్యకర్తలు, క్యాడర్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటి? అంటే గ్రూపులే అని తెలుస్తోంది. ముఖ్యంగా నలుగురైదుగురు ఎంపీ అభ్యర్థుల తీరుతో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు, క్యాడర్ తలలు పట్టుకుంటున్నారు.
భయపడిపోతున్న క్యాడర్
తెలంగాణలో బీజేపీ ప్రముఖులుగా చెప్పుకునే నేతలంతా గెలవడంతో పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఇక కిషన్ రెడ్డికి కేంద్ర ఇండిపెండెట్ మంత్రి పదవి లభించగా బండి సంజయ్ కి సహాయ మంత్రి పదవి లభించింది. పదవులు రాని ఎంపీలుగా మిగిలిన డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్, ఈటల రాజేందర్ కూడా కేంద్ర మంత్రి పదవులు ఆశించి భంగపడ్డారు. ఒకప్పుడు రెండు లేక మూడు స్థానాలలో బీజేపీ గెలుపొందినప్పుడు రాని సమస్య ఇప్పుడు సీట్లు పెరిగినాక సమస్యలు కూడా అధికమయ్యాయి. అయితే గెలిచిన ఎంపీలతో కలిసి సన్మానించుకుని కనీసం ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి సైతం క్యాడర్ భయపడుతోందని సమాచారం. ఎందుకంటే వీళ్ల మధ్య ఆధిపత్య పోరు అమాంతం పెరిగిపోయింది. ఎందుకంటే రాబోయేవి స్థానిక ఎన్నికలు. ప్రత్యేకంగా ఏ కిసన్ రెడ్డి వర్గమో, లేక బండి వర్గమో, ధర్మపురి వర్గమో, డీకీ అరుణ గ్రూపో అని తెలిస్తే స్థానిక ఎన్నికలలో వారికి టిక్కెట్ రాకుండా చేస్తారేమో అనే భయం పట్టుకుంది క్యాడర్ కి.
ఇగో తో పనిచేస్తున్న ఎంపీలు
పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా కాషాయ నేతలు కడుపులో ఈగోని పెట్టుకుని పనిచేస్తారని విమర్శకులు చెబుతున్నారు. ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్న కిషన్ రెడ్డికి కూడా మొదటినుంచి అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం కాదు. బండి సంజయ్ ప్రాధాన్యం తగ్గడానికి కిషన్ రెడ్డి తిప్పిన చక్రమే కారణం అని అనుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో కిషన్ రెడ్డి అందరినీ కలుపుకుని పోతే మరింత మంచి ఫలితాలే వచ్చివుండేవని పార్టీ వర్గాలే బాహాటంగా చర్చించుకుంటున్నారు. వీరికి తోడు రాజ్యసభ సభ్యుడైన లక్హణ్ కూడా పార్టీలో సీనియర్ నేతగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటారని టాక్.
నివురుగప్పిన నిప్పులా విబేధాలు
ముఖ్య నేతల మధ్య విబేధాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకరి మనిషిగా గుర్తింపు వస్తే..మరో నేతతో ఇబ్బంది వస్తుందనే భయం క్యాడర్ను, దిగువ స్థాయి నేతల్ని ఆవహించింది. అందుకే తమకు నమ్మకం ఉన్న, సత్సంబంధాలున్న నాయకులను చాటు మాటుగానే కలుస్తూ స్థానిక నేతలు, క్యాడర్ తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు. ఇంకా తెలంగాణ పార్టీ సారధ్యం ఎవరికి ఇవ్వాలో క్లారిటీ రాలేదు. ఇచ్చాక మరిన్ని గ్రూపులు తయారవ్వొచ్చు. రాబోయే స్థానిక ఎన్నికలలో తమ సత్తాని చాటాలనుకుంటున్న బీజేపీకి ఇక్కడి స్థానిక సీనియర్ నేతల తీరుతో కొత్త సమస్యలు వచ్చిపడేలా ఉన్నాయి.