KTR On CM Revanth: బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ లో జరిగిన అభివృద్ధి గురించి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివేదిక విడుదల చేశారు. ‘జూబ్లీహిల్స్ ప్రగతి వేదిక’ పేరుతో తెలంగాణ భవన్ నిర్వహించిన కార్యక్రమంలో వాటిని వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో కేటీఆర్ విరుచుకుపడ్డారు. గత పదేళ్లలో జూబ్లీహిల్స్ ను నిర్లక్ష్యం చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి పై చర్చించేందుకు తనతో చర్చకు రావాలని సీఎం రేవంత్ కు సవాలు విసిరారు.
ఓటమి భయంతోనే దూషణలు
హైదరాబాద్ లోని అసెంబ్లీ, సచివాలయం, గాంధీ భవన్ ఎక్కడైనా సరే రేవంత్ తో చర్చకు తాను సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరాశ, నిస్పృహతో ఉన్నారు. ‘జూబ్లీహిల్స్ బైపోల్స్ లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని రేవంత్ కు అర్థమైంది. అందుకే నాపై రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణకు దిగారు. ఓటమి తప్పదని భావించి రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారు. ఆయన కంటే గట్టిగా మాట్లాడగలను. రేవంత్ కు సమాధానం చెప్పే సత్తా ఉంది. కానీ కేసీఆర్ సూచనతోనే రేవంత్ పై వ్యక్తిగత దూషణకు దిగటం లేదు’ అని కేటీఆర్ అన్నారు.
‘డ్రగ్ కల్చర్ పెరిగింది’
బీఆర్ఎస్ హాయాంలో చేసిన పనులను ప్రజలకు చెప్పమని కేసీఆర్ తనకు చెప్పినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ‘నన్ను వ్యక్తిగతంగా తిట్టినా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి రేవంత్ ను గౌరవిస్తున్నా. హోంశాఖను చూస్తున్న రేవంత్ రెడ్డి హాయాంలో శాంతి భద్రతలు క్షీణించాయి. హైదరాబాద్ లో గన్, డ్రగ్ కల్చర్ పెరిగింది. కాంగ్రెస్ హాయాంలో హైదరాబాద్.. చెత్త సిటీ, క్రైం సిటీగా మారిపోయింది. అండర్ పాస్ లు, ప్లైఓవర్లు కేసీఆర్ హాయాంలోనే నిర్మించాం. కాంగ్రెస్ వచ్చాక ఎన్ని ఫ్లై ఓవర్లు కట్టారో చెప్పాలి. పదేళ్లలో వంద లింకు రోడ్లు నిర్మించాం. కాంగ్రెస్ వచ్చాక ఒక గుంత కూడా పూడ్చలేదు’ అని కేటీఆర్ మండిపడ్డారు.
లై డిటెక్టివ్ టెస్టుకు సిద్ధం
సీఎం అంటే కటింగ్ మాస్టర్ మాదిరి రేవంత్ వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సిటీలో మళ్ళీ మంచి నీటి కష్టాలను కాంగ్రెస్ తీసుకొచ్చింది. చెత్త సమస్య పరిష్కారానికి స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం. మెట్రో నిర్మించిన ఎల్ అండ్ టీని రేవంత్ రెడ్డి బెదిరించి పంపించారు. తనపై ఉన్న ఏసీబీ కేసులో రేవంత్ వస్తే.. ఫార్ములా ఈ రేస్ కేసులో నేను లై డిటెక్టివ్ టెస్ట్ కు రెడీ. ఫార్ములా ఈ రేసు కేసులో విషయం లేదు కాబట్టే గవర్నర్ అనుమతి ఇవ్వాలంటున్నారు. నా ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఎప్పుడో అనుమతి ఇచ్చారు’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
Also Read: CM Revanth Reddy: కారు గుర్తుకు ఓటేస్తే.. కమలంకు వేసినట్లే.. సీఎం రేవంత్ రెడ్డి
‘ముస్లింలను సీఎం అవమానించారు’
కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. అలా చెప్పడం ద్వారా ముస్లింలను సీఎం అవమానించారని మండిపడ్డారు. ‘ముస్లిం సమాజానికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి. లేకుంటే కాంగ్రెస్ కు ఎలా సమాధానం చెప్పాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. కాంగ్రెస్ పుట్టకముందు నుంచీ ముస్లింలు ఉన్నారు. సీఎం రేవంత్.. తన అజ్ఞానం నుంచి బయటకు రావాలి. బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు. కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారు’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
