– రుణమాఫీ ప్రకటనతో సంతోషంలో రైతులు
– కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంపై సర్వత్రా హర్షం
– గాంధీ భవన్లో కిసాన్ కాంగ్రెస్ నేతల సంబురాలు
– టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్న నాయకులు
Gandhi Bhawan: రైతుల సంక్షేమమే లక్ష్యంగా రుణమాఫీ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రైతుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. ఇదే క్రమంలో గాంధీ భవన్లో కిసాన్ కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం ఏకకాలంలో ప్రతి రైతుకు 2లక్షల రుణమాఫీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోదండ రెడ్డి మాట్లాడుతూ, జాతీయ కిసాన్ సెల్ తరఫున రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
‘‘2014 కంటే ముందు రాష్ట్ర అప్పు 72,658 కోట్లు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 6,71,751 కోట్లు. కేసీఆర్ కుటుంబానికి దోచుకుకోవడమే తప్ప అభివృద్ధిపై దృష్టి లేదు. ఎన్నికల్లో అందరి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని సమగ్ర మేనిఫెస్టో రూపొందించాం. ప్రధానంగా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఇందిరా గాంధీ హయాం నుండి కాంగ్రెస్ రైతులకు ప్రాధాన్యం ఇస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసరికి ఖజానా ఖాళీ అయ్యింది’’ అంటూ విమర్శలు చేశారు. మరోవైపు, గాంధీ భవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఏక కాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ నిర్ణయం చారిత్రకమన్నారు. ఇంతటి ఘనత సాధించి రైతాంగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వ పనితీరును విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రుణ మాఫీ చేస్తున్నారని తెలిపారు. ఎన్ని ఆర్థిక అవాంతరాలు వచ్చినా అన్నింటినీ అధిగమించి రుణమాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని వివరించారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.
