Harish Rao: రైతు రుణమాఫీపై క్లారిటీ వచ్చేయడంతో మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలన్నారు. ఆయన చెప్పిన మాటను నిలబెట్టుకుని రాజీనామా చేయాలని చెప్పారు. ఎక్కవ మొత్తంలో రైతు రుణమాఫీ చేస్తున్నామన్న ఆయన, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నస్టపోయిన రైతులకు కూడా పరిహారం అందిస్తామని తెలిపారు. వరి మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ కూడా చెల్లిస్తామని తెలిపారు.
హరీష్ రావుపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మండిపడ్డారు. రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలని సెటైర్లు వేశారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ సవాల్కు హరీష్ రావు కట్టుబడి ఉండాలన్నారు. మాట ఇస్తే నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ అని, వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పినట్లుగా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నట్టు చెప్పారు. 2014 నుండి 2023 వరకు బీఆర్ఎస్ సర్కార్ ఎంత రుణమాఫీ చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఎన్నో గ్యారెంటీలను అమలు చేసిందని వివరించారు. అలాగే, బీజేపీ సంపన్నులకు రుణమాఫీ చేసిందని, రైతుల్ని పట్టించుకోలేదని విమర్శించారు.
రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రాబోతుందని అన్నారు కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి. చెప్పిన మాట ప్రకారం హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్పారు. స్పీకర్ ఫార్మెట్లో సిద్ధం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, ఏక కాలంలో రుణమాఫీ అనేది కేవలం కాంగ్రెస్కే సాధ్యమని తెలిపారు. కేసీఆర్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోలేదని విమర్శించారు. లక్ష రుణమాఫీని ఆరు సార్లు చేశారని చురకలంటించారు.