TG Heavy Rains: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రాగల 24 గంటల్లో అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్, యాదాద్రి భువనగిరి, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
తుఫాన్ వల్ల తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలపై బుధవారం రెవెన్యూ విపత్తుల నిర్వహణ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో పరిస్థితి గురించి ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాలలో చేపట్టవలసిన రక్షణ సంబంధిత చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్తు, పంచాయతీ రాజ్, ఆర్&బి తదితర విభాగాలతో రెవెన్యూ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని సూచించారు. వాగులు, కాల్వలు, చెరువుల దగ్గర పోలీసులతో పర్యవేక్షించాలని, స్థానిక అధికారులు అత్యవసర సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి పొంగులేటి సూచించారు.
Also Read: Cyclone Montha: మెుంథా తుపాను ప్రభావం.. మత్స్యకారులకు సీఎం శుభవార్త.. కీలక ఆదేశాలు జారీ
మరోవైపు రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెుంథా తుపాను ప్రభావం కనిపిస్తోంది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో వర్షం కురుస్తోంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో గడిచిన 2 గంటల్లో 9.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో 8 సెంటీమీటర్ల పైగా వర్షపాతం కురిసింది. మరోవైపు వర్ధన్నపేట, పర్వతగిరి, నెక్కొండ మండలాల్లో భారీ వర్షానికి వరి పంటలు దెబ్బతిన్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, కురవి మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ఇదిలా ఉంటే జనగామ జిల్లాలోని పాలకుర్తి, దేవరుప్పుల మండలాల్లో 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
