MGNREGA: ఉపాధిహామీ పథకంలో అవకతవకలు జరిగినట్లు ప్రచారం ఊపందుకుంది. అంతే కాదు మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న సోషల్ ఆడిట్ల సమయంలో ఫిర్యాదులు సైతం వస్తున్నాయి. కొన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్న ఘటనలు ఉన్నాయి. దీంతో ఈ నిధుల రికవరీపై పంచాయతీరాజ్(Panchayat Raj) అధికారులు ఫోకస్ పెట్టారు. త్వరలోనే స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నట్లు సమాచారం.
థర్డ్ పార్టీ సంస్థలతో ఆడిట్..
ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనుల్లో అవినీతిని నిర్మూలించడంతోపాటు పారదర్శకత, జవాబుదారితనం పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ నిధులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా గ్రామాల్లో థర్డ్ పార్టీ సంస్థలతో ఆడిట్ (సోషల్ ఆడిట్) నిర్వహిస్తున్నారు. సామాజిక తనిఖీలో వెల్లడైన అంశాలను నాలుగు విభాగాలుగా గ్రీవెన్సెస్ (ఫిర్యాదులు), ప్రొసెస్ వాయిలేషన్ (నిబంధనల ఉల్లంఘన), ఫైనాన్షియల్ డీవియేషన్ (పనుల కొలతల్లో తేడాలు), ఫైనాన్షియల్ మిస్ అప్రోపియేషన్ (నిధుల దుర్వినియోగం)పై ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఈ నాలుగింటిపై వచ్చిన ఫిర్యాదులను (పేరాలు)గా పేర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పేరాల నివేదికను ప్రభుత్వ యంత్రాంగానికి డెసిషన్ టేకెన్ రిపోర్టు (డీటీఆర్) రూపంలో అందజేస్తున్నారు. ఆర్ 9.3.1 వెబ్ రిపోర్ట్ ఆధారంగా సామాజిక తనిఖీలో గుర్తించిన అవకతవకలకు సంబంధించిన అంశాలు 2018– 2025 ఆర్థిక సంవత్సరం వరకు 12 లక్షలపైగా పేరాలు గుర్తించగా, ఇందులో సగం పేరాలపై చర్యలు తీసుకోలేదని సమాచారం. ఇది అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. వాస్తవానికి 2, 3 నెలల్లో ఈ అంశాలను పరిష్కరించాల్సి ఉండగా.. ఏండ్లు పెండింగ్ పెడుతూ వస్తున్నారు. స్వీకరించిన ఫిర్యాదులను ఉపాధి హామీ చట్టం నిబంధనల ప్రకారం 7 నుంచి 15 రోజుల్లో పరిష్కరించాల్సి ఉన్నట్లు సమాచారం. కానీ ఏండ్లుగా ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కూలీల సమస్యలను సైతం సుమాటోగా స్వీకరించి, లేదా అందిన ఫిర్యాదుల మేరకు పరిష్కారానికి కృషి చేయాల్సిన అంబుడ్స్మెన్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
చర్యలుతో నిధులు రికవరీ..
సామాజిక తనిఖీల్లో లక్షా 50వేల ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. మండల స్థాయిలోనే పరిష్కారం చూపడంతో పాటు అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని నిధులను రికవరీ చేయాల్సి ఉంది. కానీ ఆదిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని సమాచారం. దీంతో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకొని నిధుల రికవరీపై స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నట్లు సమాచారం. ఏడేండ్లలో రూ.183 కోట్ల అక్రమాలు జరిగినట్లు వెల్లడికాగా కేవలం రూ.58 కోట్లు మాత్రమే రికవరీ చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అంతే అధికారులు ఏమేరకు పనిచేశారని వారి తీరును స్పష్టమవుతోంది.
Also Read: Kunamneni Sambasiva Rao: మోదీ పాలనలో దేశ పరిస్థితి తిరోగమనం: ఎమ్మెల్యే కూనంనేని
స్పెషల్ ఫోకస్..
గ్రామీణ పేదలకు ఉపాధితోపాటు వలసలను నివారించి ఆర్థిక భరోసా కల్పించేందుకుకేంద్రం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అమల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ స్కీమ్ గ్రామాల్లో వసతుల కల్పన, వ్యవసాయ, రైతులకు ఆసరాగా నిలుస్తున్నది. ఈ పథకంలో నిధుల దుర్వినియోగం అరికట్టడంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ సృజన కూలీల పని దినాలు, వారి సమస్యలపై దృష్టిసారించారు. అన్ని జిల్లాల డీఆర్డీఓలు(DRDO), జడ్పీ సీఈఓ(ZPCEO)లు, డీపీఓ(DPO)లు, ఎంపీడీఓ(MPDO)లకు ఆదేశాలు జారీచేశారు. నిధుల రికవరీ, గ్రామీణ పేదలకు ఉపాధి, సుస్థిర ఆస్తుల కల్పన దిశగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. సామాజిక తనిఖీ రికార్డులను త్వరితగతిన అందజేయడం, ఆడిట్ సమస్యలు వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదుదారుల అభ్యంతరాలకు సమాధానం ఇవ్వాలని, వంద శాతం రికార్డులు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
ఆర్థిక దుర్వినియోగం..
ఇది ఇలా ఉంటే ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన 30 రోజుల్లోపు ఎంపీడీఓ(MPDO)లు, ఏపీఓ(APO)లు అన్ని ఫిర్యాదుల పేరాలను పరిష్కరించి, ఏటీఆర్(ATR)ను అప్లోడ్ చేయాల్సి ఉంది. కానీ జిల్లా అధికారులు మాత్రం చోద్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్ (క్యూసీ) సూచించిన పేరాలను సకాలంలో మూసివేయాల్సి ఉంది. కానీ ఆదిశగా ముందుకు సాగడం లేదని సమాచారం. ఆర్థిక దుర్వినియోగం జరిగినట్లు తేలితే వెంటనే రికవరీ చేయడంతోపాటు క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టడంలో జాప్యం జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సామాజిక తనికీల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి.
Also Read: Jubilee Hills By-Election: చిన్న శ్రీశైలం యాదవ్ బైండోవర్.. మరో 100 మందికి పైగా రౌడీషీటర్లు కూడా!
