Osmania University: ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అగ్రగామి విద్యా సంస్థగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) హామీ అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి సలహాదారు డాక్టర్ కేశవరావు నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ సోమవారం ఓయూ క్యాంపస్లో పర్యటించింది. ఇంజనీరింగ్, ఆర్ట్స్, లా కాలేజీలు, లైబ్రరీ, వివిధ హాస్టళ్లు సహా క్యాంపసులోని ప్రధాన ప్రాంతాలను సందర్శించి, వసతులను ప్రతినిధులు పరిశీలించారు. రానున్న 30 ఏండ్ల విద్యా అవసరాలకు అనుగుణంగా ఓయూ సమగ్రాభివృద్ధి కోసం రూ.వెయ్యికోట్ల నిధులతో మౌళిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కమిటీ అభిప్రాయపడింది.
విద్యార్థి నివాసాలు శిథిలావస్థలో..
రూ.వెయ్యికోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలలో ప్రధానంగా ఇంటర్నెషనల్ లెవెల్లో క్లాసు రూములు, అత్యాధునిక ఆడిటోరియాలు, కేంద్రీకృత డిజిటల్ లైబ్రరీ, ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్ హాస్టల్స్ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యార్థి నివాసాలు శిథిలావస్థలో ఉన్నాయని గుర్తించిన కమిటీ, వాటికి తక్షణమే సమగ్ర పునరుద్ధరణ, ఆధునికీకరణ అవసరమని నిర్ధారించింది. వీటితో పాటు పర్యావరణ అనుకూల వాతావరణం, సౌరశక్తి వినియోగం, కేంద్రీకృత వ్యాయామశాలల ఏర్పాటు వంటి అంశాలు చర్చకు వచ్చాయి. మౌళిక వసతుల కల్పన ద్వారా ఓయూను విద్యా, పరిశోధన, ఆవిష్కరణలకు నిలయంగా మార్చడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు, ఇక్కడి విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా రాణించేందుకు అవకాశం కల్పిస్తాయని, ఓయూ ఖ్యాతిని మరో వెయ్యి సంవత్సరాల వరకు కొనసాగించవచ్చని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.
Also Read: Star Heroines: ఈ స్టార్ హీరోయిన్స్ వచ్చేస్తున్నారు.. రీ ఎంట్రీలో నిలబడతారా?
సీఎం హామీ మేరకు..
సీఎం హామీ మేరకు వెయ్యి కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు తయారు చేసేందుకు సీఎం సలహాదారు కేశవరావుతో పాటు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం తదితరులు కమిటీ సభ్యులతో సమీక్షించారు.
Also Read: Shiva Statues India: భారతదేశంలో అతిపెద్ద శివుని విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?
