– జీవో 46 బాధితులకు న్యాయం చేయాలి
– సీఎస్ను కలుద్దామని సచివాలయం వెళ్తే అపాయింట్మెంట్ లేదన్నారు
– వినతి పత్రాన్ని గోడకు అంటించాం
– బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది
– ప్రభుత్వంపై రాకేష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
Congress: రాష్ట్రంలో పాలన పడకేసిందని అనుకున్నాం.. కానీ, అటకెక్కింది అంటూ సెటైర్లు వేశారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. జీవో 46 బాధితుల పక్షాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందించేందుకు ఆయన సచివాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాకేష్ రెడ్డి, ప్రభుత్వానికి పీఆర్ స్టంట్ మీద ఉన్న సోయి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో లేదని విమర్శించారు. ఆశా వర్కర్లు, అంగన్ వాడీలు, గురుకుల టీచర్లు, ఆందోళన చేస్తుంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకోవడం లేదంటూ ఫైరయ్యారు రాకేష్ రెడ్డి. జీవో 46 బాధితులను పట్టించుకోవడం లేదన్న ఆయన, 60 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం వస్తే, 90 మార్కులు వచ్చిన వారికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ మరిచి కాంగ్రెస్ నేతలు ముఖం చాటేశారని విమర్శించారు.
జీవో 46 బాధితులు కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారని, వారంతా కేటీఆర్, హరీష్ను కలిశారని తెలిపారు. వారి పక్షాన తాము సీఎస్ను కలిసేందుకు వచ్చామని, 10 రోజులుగా వెయిట్ చేస్తున్నా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. వినతి పత్రాన్ని సెక్రటేరియట్ గోడకు అంటించామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటుందని, వారి పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వారిని ప్రజా భవన్ పిలుచుకొని, భోజనం చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలన అని చెబుతున్న రేవంత్ ప్రభుత్వం జీవో 46 వెనక్కి తీసుకోవాలి, లేదా సవరణ చేయాలని డిమాండ్ చేశారు రాకేష్ రెడ్డి.