– హరీష్ రావు ఎప్పుడైనా బీజేపీలోకి వెళ్లొచ్చు
– ఆయన పొర్లు దండాలు పెట్టినా బీఆర్ఎస్ పగ్గాలు దక్కవు
– హరీష్, రఘునందన్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది
– రెండు ఎన్నికల్లో ఓడిపోయినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదు
– బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయి
– బీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
Harish Rao: ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హస్తం నేతలు ఫైరవుతున్నారు. అసెంబ్లీ మీడియా హల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, హరీష్ రావు త్వరలోనే బీజేపీలోకి వెళ్తారని అన్నారు. పోర్లు దండాలు పెట్టినా కూడా హరీష్కు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఇవ్వరని, ఆ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని ఆరోపించారు. హరీష్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని, ఆయన తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని హితవు పలికారు. చిల్లర మాటలు మానకపోతే ప్రజలు ఉరికించి కొడతారని హెచ్చరించారు.
బీఆర్ఎస్ చేసిన పాపాలను కడుక్కోవాలన్న ఐలయ్య, మీడియా ముందు మాట్లాడకపోతే మామకి అనుమానం వస్తుందని హరీష్ భయపడుతున్నారని ఎద్దేవ చేశారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినప్పటి నుండి కేసీఆర్, కేటీఆర్ గాయబ్ అయ్యారన్నారు. ప్రజలు పరువు తీసినా బీఆర్ఎస్ నేతలకు సిగ్గు రావడం లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ అవయవదానం చేసిందని సెటైర్లు వేశారు. గత ప్రభుత్వ పాలన కంటే తమ పాలన బాగుందని ప్రజలు చెబుతున్నారని, జూలై 17 నుండి రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.
ఇక, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట, సిరిసిల్ల అడ్డా అంటారు. అక్కడే బీఆర్ఎస్ పరిస్థితి ఏమైందో తెలుసుకోవాలని చురకలంటించారు. రఘనందన్, హరీష్ రావు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్న ఆయన, అసెంబ్లీ ఎన్నికల్లో రెండవ స్థానంలో ఉన్న బీఆర్ఎస్, పార్లమెంట్ ఎన్నికల్లో మూడవ స్థానానికి ఎందుకు దిగజారిందని ప్రశ్నించారు. అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో హరీష్ రావు నేర్పరి అంటూ, రేవంత్ నాయకత్వం బలపడుతుందన్న భయంతోనే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని విమర్శించారు. బీజేపీకి ఓటేయాలని బీఆర్ఎస్ నేతలు తమ క్యాడర్కి చెప్పారని మండిపడ్డారు.