BRS ex ministers meet kavitha at Tihar prision:
లిక్కర్ కుంభకోణం కేసులో తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ములాఖత్ లో భాగంగా కలిశారు. రీసెంట్ గా కవిత సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్ కవితను కలిసిన సంగతి విదితమే. కాగా ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు జులై 3 వరకూ రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న అధికారులు ఆమె నివాసంలో అరెస్ట్ చేశారు. జూన్ 15తో కవిత అరెస్టయి 3 నెలలు కావస్తోంది.
ఆధ్యాత్మిక చింతనతో..
రెండు దఫాలుగా 10రోజుల ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవితకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. 14 రోజులకు ఒకసారి కవిత జ్యుడీషియల్ కస్టడీ ని కోర్టు పొడిగిస్తూ వస్తుంది. తీహార్ జైల్ లో జ్యూడీషియల్ కస్టడీలో ఉండగానే.. ఏప్రిల్ 11న కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం సీబీఐ కేసులోనూ రౌస్ అవెన్యూ కోర్టు కవితకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. సీబీఐ కేసులో కవిత జ్యూడీషియల్ కస్టడీని మే20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కోర్టు అనుమతితో జైల్లో పలు పుస్తకాలను చదువుతూ ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో కవిత గడుపుతున్నారు.
ఫోన్లో కుటుంబ సభ్యులతో
లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐల అరెస్ట్ లను సవాల్ చేస్తూ, బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యూలర్ బెయిల్ పిటిషన్లను ఇప్పటికే రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు లో సవాల్ చేయగా.. కవిత బెయిల్ పిటిషన్ల పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇదిలాఉంటే తీహార్ జైల్ లో ఉన్న కవితతో ఆమె భర్త అనిల్ వారానికి రెండు సార్లు ములాఖత్ అవుతున్నారు. ప్రతిరోజు కవితతో ఐదు నిమిషాలు ఫోన్లో కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు.