kakatiya university students protest on phd admissions | Kakatiya University: కేయూలో మళ్లీ పీహెచ్‌‘ఢీ’
kakatiya university
Political News

Kakatiya University: కేయూలో మళ్లీ పీహెచ్‌‘ఢీ’

– ఆందోళనబాట పట్టిన విద్యార్థులు
– ప్రభుత్వం వేసిన కమిటీ సూచనలకు భిన్నంగా నిర్ణయాలు!
– ఇంచార్జీ వీసిని తప్పుదోవ పట్టిస్తున్న రిజిస్ట్రార్
– ఆందోళన చేస్తున్న విద్యార్థుల ఆరోపణలు
– పారదర్శకంగా పీహెచ్‌డీ సీట్ల భర్తీకి డిమాండ్

Ph.D Admissions: కాకతీయ యూనివర్సిటీలో మళ్లీ పీహెచ్‌డీ అడ్మిషన్లపై రగడ మొదలైంది. విద్యార్థులు మరోసారి ఆందోళనబాట పట్టారు. వరుసగా మూడు సంవత్సరాలు పీహెచ్‌డీ సీట్ల భర్తీలో అవకతవకలు జరుగుతున్నాయని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేస్తూ సీట్లు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచనలను కాలరాసి అందుకు భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహించారు. ఉన్నత విద్యామండలి నివేదికను బేఖాతరు చేస్తూ ఇంచార్జీ వీసీ వాకాటి కరుణను రిజిస్ట్రార్ తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వెంటనే సీట్ల భర్తీ ప్రక్రియను నిలిపేయాలని, ఉన్నత విద్యామండలి నివేదిక ఆధారంగానే సీట్లను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో అన్యాయం జరిగిన విద్యార్థులకు న్యాయం చేయాలని, పీహెచ్‌డీ సీట్ల భర్తీని పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ మల్లారెడ్డి చాంబర్‌లో విద్యార్థులు సోమవారం బైఠాయించారు.

గతేడాది 34 రోజుల ఆందోళన

అర్హులైన విద్యార్థులకు అన్యాయం చేసి సీట్ల భర్తీ జరిగిందని, అనేక అక్రమాలూ చోటుచేసుకున్నాయని గతేడాది ఆందోళనలు చేశారు. వీసీ చాంబర్‌లో బైఠాయించి ఆందోళన చేస్తుండగా విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆరుగురు విద్యార్థులకు గాయాలవ్వగా.. వారితో కలిసి కేయూ ప్రాంగణంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. 34 రోజులపాటు చేసిన ఆ నిరసన దీక్షకు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అన్ని రాజకీయపక్షాల విద్యార్థులు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విచారణ కమిటీ వేసి నిజనిర్దారణ తర్వాత వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సీట్ల భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై త్రిమెన్ కమిటీ వేసింది.

సూచనలు బేఖాతరు

కాకతీయ యూనివర్సిటీలో సీట్ల కేటాయింపులో అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ కమిటీ వేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేసిన కమిటీ.. ఫస్ట్ కేటగిరిలో మిగిలిన సీట్లను సెకండ్ కేటగిరీకి కన్వర్ట్ చేయాలని, అలాగే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీట్లను కలిపి అన్నింటిని భర్తీ చేయాలని సూచించింది. కానీ, ఈ విషయంలో ఇంచార్జీ వీసీ వాకాటి కరుణను రిజిస్ట్రార్ తప్పుదోవ పట్టిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఫస్ట్ కేటగిరిలో మిగిలిన 80 సీట్లను మాత్రమే భర్తీ చేయాలని చూస్తున్నారని, దీంతో అర్హులైన విద్యార్థులకు సీట్లు రాకుండా అన్యాయం జరుగుతుందని ఆగ్రహిస్తున్నారు. ఉన్న సీట్లను కూడా లక్షల్లో రూపాయలు తీసుకుని అమ్ముకునే కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గతంలో మిగిలిన 80 సీట్లతోపాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీట్లను భర్తీ చేయాలని, అలా కాదని 80 సీట్లను మాత్రమే భర్తీ చేస్తే ఆందోళన ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?