CM Revanth Reddy: సెంటిమెంట్తో మళ్లీ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్(BRS) ప్రయత్నిస్తున్నదని, అలాంటి వారి పట్ల నిరుద్యోగులు, యువత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. గ్రూప్ 2 ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదేళ్ల పాటు పవర్లో ఉండి ఉద్యోగాల భర్తీకి చొరవ చూపలేదన్నారు. నిరుద్యోగుల గొస ఊరికే పోదని శపించారు.
పదేళ్లు ఏం చేశారు?
విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్క క్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదని ఆరోపించారు. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే నిరుద్యోగులకు ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగాలు వచ్చే ఉండేవని వివరించారు. కేసీఆర్ కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారే తప్ప, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. 15 ఏళ్లుగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ జరగలేదంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు.
ప్రజా ప్రభుత్వంతో సాకారం
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాము గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేశామని సీఎం వివరించారు. గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలను అందించామన్నారు. కొత్తగా ఉద్యోగాల్లో బాధ్యతలు తీసుకున్న వారికి తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాముల అయ్యేందుకు టీజీపీఎస్సీ అవకాశం కల్పించిందన్నారు. చీకటి రోజులు పోవాలని, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని గ్రూప్ 1 విషయంలో సమస్యలన్నింటినీ ఎదుర్కొని నియామక పత్రాలు అందజేశామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.
Also Read: Mahabubabad District: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో దందా.. ఆకాశానికెగీసిన ఇటుక ధరలు
ఉద్యోగాలను అడ్డుకునేందుకు కుట్రలు
గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో తమపై బురద జల్లే ప్రయత్నం చేశారని సీఎం గుర్తు చేశారు. అలాంటి ఏ వ్యవస్థ తమకు లేదని, ఉద్యోగులే తమ కుటుంబ సభ్యులు అని వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా పని చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు.
బీఆర్ఎస్ పాపాల పుట్ట పగిలింది
గత పాలకుల పాపాల పుట్ట పగులుతున్నదని, వాళ్ల దోపిడీ గురించి వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నారని సీఎం న్నారు. హాస్టల్లో విద్యార్ధులకు పుడ్ పాయిజన్ జరిగితే పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. విద్యార్ధులెవ్వరూ ప్రాణాలు కోల్పోకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు. సమర్ధవంతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. దేశంలోనే తెలంగాణ(Telangana)ను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలని, రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దని అభ్యర్థులకు సూచించారు. నిస్సహాయులకు సహాయం చేసి, పేదలకు అండగా నిలవాలని కోరారు. ఉద్యోగులు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, జీతంలో 15 శాతం కట్ చేసి వారికి ఇస్తామని అన్నారు. దానికోసం కొత్త చట్టం తెస్తామని చెప్పారు.
Also Read: Movie rating system: సినిమాకు రేటింగ్ ఏ ప్రాతిపదికన ఇస్తారు.. ఫుల్ రేటింగ్ వచ్చిన సినిమా ఏమైనా ఉందా?
