Cabinet Meeting: మద్ధతు ధరతో కలిపే సన్నాలకూ రూ.500 బోనస్
మూడు అగ్రికల్చర్ కాలేజీలు ఏర్పాటు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
కేబినెట్లో కీలక నిర్ణయాలకు ఆమోదం
ఈ నెల 23న తదుపరి కేబినెట్ సమావేశం
బీసీ రిజర్వేషన్లపై చర్చ
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. ధాన్యానికి చెల్లించే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఇచ్చే రూ.500 బోనస్ రైతుల ఖాతాల్లో వెంట వెంటనే జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. వానాకాలం సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని కేబినెట్ (Cabinet Meeting) నిర్ణయించింది. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, పౌర సరఫరాల శాఖ, రవాణా శాఖ సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రం పర్యవేక్షణ, సమన్వయానికి ఒక్కో అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. గురువారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన మీటింగ్ లో కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు. ఈ వానాకాలంలో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నారు. దేశంలోనే ఇది రికార్డు స్థాయి ఉత్పత్తి అని వివరించారు. ఇందులో రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల విభాగం అంచనా వేసిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు మాత్రమే అంగీకరించగా, మరో 15 లక్షల మెట్రిక్ టన్నులుసేకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని మంత్రి వర్గం నిర్ణయించిందన్నారు. కేంద్రం అప్రూవల్ ఇచ్చినా, లేకున్నా రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.
మూడు అగ్రికల్చర్ కాలేజీలు..
ఇక రాష్ట్రంలో కొత్తగా మూడు అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటు కు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నదన్నారు. హుజూర్ నగర్, కొడంగల్, నిజామాబాద్ లో అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వివరించారు. దీంతో పాటు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన -ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఉత్సవాల నిర్వహణ.. సంబంధిత ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Read Also- Ear Protection: చెవులలో ఉండే గులిమి మంచిదే అంటున్న నిపుణులు
ఇద్దరు పిల్లల నిబంధన ఔట్..
ఇద్దరు పిల్లలకు మించి సంతానమున్న వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను మంత్రివర్గం పునరాలోచన చేసిందన్నారు. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ఠ నిబంధన ను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తం కాగా, ఈ నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ సూచనప్రాయంగా అంగీకరించింద్ననారు. ఈ నిబంధనను తొలగిస్తున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్కు పది ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసిందన్నారు. అంతేగాక నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయానికి ఇప్పుడున్న చోటనే అదనంగా 7 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. నల్సార్ యూనివర్సిటీ అడ్మిషన్లలో ఇప్పుడు తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతం పెంచాలని కేబినెట్ తీర్మానం చేసిందన్నారు.
మెట్రో విస్తరణకు హైలెవల్ కమిటీ?
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మెట్రో 2A, 2B విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ మోడ్లో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై సుదీర్ఘంగా కేబినెట్ చర్చించిందన్నారు. మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నత అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. సీఎస్ ఛైర్మన్గా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడీ కార్యదర్శి, లా సెక్రెటరీ, మెట్రో రైలు ఎండీ, అర్బన్ ట్రాన్స్పోర్ట్ అడ్వయిజర్ అధికారుల కమిటీలో సభ్యులుగా ఉంటారన్నారు. ఈ అధికారుల కమిటీ తమ రిపోర్టును కేబినేట్ సబ్ కమిటీకి అందిస్తుంన్నారు. కేబినేట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించిందన్నారు.
Read Also- Telangana Tourism: రామప్ప ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పాలి.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
హ్యామ్ మోడల్ లో రోడ్ల విస్తరణ
రాష్ట్రంలో హ్యామ్ మోడ్లో మొదటి దశలో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. జాతీయ రహదారులు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారులకు సంబంధించి అభివృద్ధి, విస్తరణ పనులు చేపడుతామని మంత్రి వెల్లడించారు. దీంతో పాటు ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్ పేట ఓఆర్ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి రక్షణ శాఖ భూములు వినియోగించుకుంటున్నందున వారికి ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూములను అప్పగిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసిందన్నారు. అంతేగాక కృష్ణా-వికారాబాద్ బ్రాడ్గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హైక్టార్ల భూ సేకరణకు అయ్యే రూ.438 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసిందన్నారు. మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసిందన్నారు.
ఈ నెల 23న తదుపరి కేబినెట్ భేటీ?
ఇక ఈ నెల 23న నెక్ట్స్ కేబినెట్ ను నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఆ కేబినెట్ లో బీసీ రిజర్వేషన్ల అమలు, సుప్రీం కోర్టు డిస్మిస్ వంటి అంశాలపై చర్చిస్తామన్నారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రైతును రాజును చేసే వరకు శ్రమిస్తునే ఉంటుందన్నారు. అంతేగాక ప్రజలకు అవసరమైన ఇన్ ఫ్రాస్ట్రక్చర్, టూరిజం డెవలప్, మెట్రో విస్తర ణ తో పాటు పలు డెవలప్ మెంట్ పనులన్నీ ఇక నుంచి స్పీడప్ అవుతాయన్నారు. ఈకార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ బలరామ్ నాయక్ పాల్గొన్నారు.
