– బీఆర్ఎస్ హయాంలో అనర్హులకు పోడు భూములు
– పంపిణీపై నివేదిక సమర్పించాలి
– అటవీశాఖ ఉన్నతాధికారులకు మంత్రి సురేఖ ఆదేశం
– అటవీశాఖకు, రైతులకు మధ్య ఘర్షణలు నివారించేలా చర్యలు
Minister Surekha Ordered The High Officials To Waste Land For The Ineligible: పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, వారి ఉపాధికి భంగం కలగకుండా అటవీశాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ భూముల రక్షణకు కృషి చేయాలని సూచించారు మంత్రి కొండా సురేఖ. సచివాలయంలో శనివారం పోడు భూములపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాలు అటవీశాఖ అధికారులకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని చెప్పారు. అలాగే, పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతుల హక్కులను కాపాడుతామని స్పష్టం చేశారు.
అటవీశాఖ భూములను కాపాడే అధికారులకు రక్షణ కల్పించడంలోనూ ప్రభుత్వం ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నదని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఏళ్ళుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదన్న ఆమె, వ్యవసాయం పేరుతో మార్గదర్శకాలకు, చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను ఆధీనంలోకి తీసుకున్నట్లైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ గ్రామంలో ఎఫ్ఆర్ఓ, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లపై గిరిజనులు చేసిన దాడిని సురేఖ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో, అటవీ సంపద, సహజ వనరుల పరిరక్షణకు అంతే ప్రాధాన్యత ఇస్తామన్నారు.
Also Read: రుణమాఫీ, రూట్ మ్యాప్
బీఆర్ఎస్ హయాంలో అనర్హులకు పోడు భూముల కేటాయింపు జరిగిందని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోడు భూముల పంపిణీపై నివేదికను సమర్పించాలని కొండా సురేఖ అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం వెతకాలని మంత్రి సీతక్క తనతో పలుమార్లు ప్రస్తావించారని తెలిపారు. పోడు భూముల విషయంలో అటవీశాఖకు, రైతులకు మధ్య జరుగుతున్న సంఘర్షణలను నివారించేలా చర్యలు చేపట్టాలని, మార్గదర్శకాలు రూపొందించాలని కోరారని చెప్పారు. వారి మధ్య జరిగే సంఘర్షణలతో ప్రభుత్వానికి మచ్చ రావొద్దనే ఆలోచనతో ఈ సమస్యలకు పరిష్కారం వెతికేందుకు ప్రాథమికంగా ఇప్పుడు సమావేశమయ్యామని వివరించారు. ఏళ్ళుగా కొనసాగుతున్న పోడు భూముల చిక్కు సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు తాజా సమావేశం కీలకమని మంత్రి తెలిపారు.