Seethakka: తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమం (టీజీఐఎల్పీ)పేదరికంపై తుది పోరాటంగా మారాలని మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క (Seethakka) ఆకాంక్షించారు. ఆ పోరాటంలో తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని తెలిపారు. పేదరికంపై తుది పోరులో విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సచివాలయంలో బ్రాక్ ప్రతినిధుల బృందం భేటి అయింది. సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ తెలంగాణలో టీజీఐఎల్పీ సాధించిన పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూపేదరిక నిర్మూలన దిశలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి అంతర్జాతీయ సంస్థ బ్రాక్ సంస్థ తమ వంతు సహకారం అందించాలన్నారు.
Also Read: Seethakka: మేడారం చరిత్రలో నిలిచిపోయేలా సాగుతున్న పనులు.. మంత్రి సీతక్క వెల్లడి!
స్థానిక వనరులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా జీవనోపాధి
అత్యంత పేద కుటుంబాలను గుర్తించి, వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడమే టీజీఐఎల్ పీ లక్ష్యమని పేర్కొన్నారు. స్థానిక వనరులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా జీవనోపాధి కార్యక్రమాలను రూపకల్పన చేయాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విరివిగా లభించే ఇప్ప పప్పు ఆధారంగా నూనె, ఆహార పదార్థాలు తయారీకి సంబంధించిన కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారు. స్వచ్చమైన ఇప్పపువ్వు ఆరోగ్య పరిరక్షణకు ఎంతో మేలు చేస్తుందని, దానిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి ఆదాయ వనరుగా మలచవచ్చు అని మంత్రి సూచించారు.
3,554 అత్యంత పేద కుటుంబాలను గుర్తింపు
బ్రాక్ ప్రతినిధులు మాట్లాడుతూ ఐదు జిల్లాల పరిధిలోని 8 మండలాల్లో టీజీఐఎల్పీ అమలవుతోందని, ఇప్పటి వరకు 3,554 అత్యంత పేద కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు. ఎంపిక చేసిన మహిళా సమాఖ్యలతో 108 మంది నిపుణులను నియమించి లబ్ధిదారులకు శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. టీజీఐఎల్పీ కార్యక్రమంతో పేద కుటుంబాలకు దీర్ఘకాలిక ఆదాయ మార్గాలను కల్పించి, వారిని ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపించడం లక్ష్యమన్నారు. మరో 8 వేల కుటుంబాలకు నైపుణ్య శిక్షణతో పాటు వారి ఆదాయ మార్గాలను పెంచే విధంగా ఆర్దిక చేయూత అందిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గ్రెగరీ చెన్ , శ్వేతా బెనర్జీ , ఉషా రాణి, వి. రమేష్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Seethakka: పదేళ్లలో తెలంగాణను అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్.. సీతక్క కీలక వ్యాఖ్యలు
