– కరెంట్ నోటీసులు రాజకీయ కక్ష అనడం పద్దతేనా?
– చేయాల్సిందంతా చేసి బెదిరింపులు ఎందుకు?
– ప్రజలకు వాస్తవాలు తెలియాలి
– కేసీఆర్ లేఖపై హస్తం నేతల ఆగ్రహం
Congress reaction on KCR’s letter : కరెంట్ కొనుగోళ్ల విషయంలో కమిషన్కు కేసీఆర్ రాసిన లేఖ రాజకీయ ప్రకంపనలకు దారి తీస్తోంది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ కక్ష సాధింపు అనేలా కేసీఆర్ మాట్లాడడంపై హస్తం నేతలు అభ్యంతరం చెబుతున్నారు.
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ దీనిపై స్పందిస్తూ, కేసీఆర్పై ఫైరయ్యారు. తన పేరును ప్రభుత్వం బద్నాం చేస్తోందని అనడంలో అర్థం లేదన్నారు. అన్నీ చేసింది కేసీఆరేగా, ఆనాడు అన్ని శాఖలో ఆయన చెప్పిందే వేదం కదా అంటూ సెటైర్లు వేశారు. కానీ, ఇప్పుడు విచారణలో పేరు రాగానే ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రులు చేసింది ఏముంది, అంతా కేసీఆరే చేశారంటూ విమర్శించారు. కమిషన్ విచారణ సజావుగా సాగనివ్వాలని కేసీఆర్కు సూచించిన అద్దంకి, బెదిరించే ధోరణి సరికాదని హితవు పలికారు. విచారణ ముందుకు సాగకుండా చేసే పని చేయొద్దని, ప్రజలకు వాస్తవాలు తెలియాలని చెప్పారు. ఎవరినో కావాలని నిందితులుగా చేయడానికి విచారణ కొనసాగడం లేదని స్పష్టం చేశారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ, కేసీఆర్కి భయం మొదలైందన్నారు. చేసిన తప్పులు బయటకు వస్తాయని, తప్పులకు శిక్ష పడుతుందేమో అని భయం పట్టుకుందని చురకలంటించారు. ‘‘12 పేజీల లేఖ రాశావు, అదే కమిషన్ ముందుకు వెళ్లి చెప్పుకోవచ్చు కదా. తప్పు చేయకపోతే, కమిషన్ ముందు నిరూపించుకో. విద్యుత్ కొనుగోలు పెద్ద కుంభకోణం. అక్రమాలు బయటకు రావాలి. ప్రజలకు నిజాలు తెలియాలి. కేసీఆర్ విచారణకు సహకరించాలి’’ అని సూచించారు.