PCC Mahesh Kumar Goud: కేంద్ర, రాష్ట్ర కమిషన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(PCC Mahesh Kumar Goud) పేర్కొన్నారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర సమాచార కమిషన్ ప్రస్తుతం 11 పోస్టులకు బదులుగా కేవలం 2 కమిషనర్లతోనే పనిచేస్తోందని, 2025 సెప్టెంబర్ తర్వాత చీఫ్ కమిషనర్ పదవి కూడా ఖాళీగా ఉంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని, వెంటనే ఈ ఖాళీలను నింపాలని ఆయన డిమాండ్ చేశారు.
రక్షణ లేకుండా దాడులు..
ఈ సందర్భంగా ఆయన ఆర్టీఐ (సమాచార హక్కు) యాక్టివిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. భోపాల్కు చెందిన పర్యావరణ కార్యకర్త షెహ్లా మసూద్ అక్రమ మైనింగ్ను బహిర్గతం చేస్తూ ఉండగా ఇంటి వద్దే కాల్చి చంపబడటం దారుణమన్నారు. కేంద్రంలోని ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వ అవినీతిని బహిర్గతం చేసే వ్యక్తులు రక్షణ లేకుండా దాడులు, వేధింపులకు గురవుతున్నారని మండిపడ్డారు.
Also Read: Muslim Population: దేశంలో ముస్లిం జనాభా పెరుగుదల వెనుక అసలు కారణం ఇదేనా?
చారిత్రక యూపీఏ చట్టాలు
డాక్టర్ మన్మోహన్ సింగ్(Dr. Manmohan Singh) నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ(Sonia Gandhi) దూరదృష్టి నాయకత్వంలోనే చారిత్రాత్మక సమాచార హక్కు చట్టం అక్టోబరు 12, 2005న అమలులోకి వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. కమిషన్లలో జర్నలిస్టులు(Journalist), సామాజిక కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు వంటి విభిన్న వర్గాల ప్రతినిధులకు అవకాశం కల్పించాలన్నారు. యూపీఏ(UPA) ప్రభుత్వం తెచ్చిన ఆహార భద్రత చట్టానికి కూడా బీజేపీ(BJP) తూట్లు పొడిచిందని ఆయన ఆరోపించారు. ఇక పార్టీ సంస్థాగత అంశాలపై మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ (సెలక్షన్ ప్రాసెస్) జరుగుతోందని తెలిపారు. త్వరలోనే అన్ని జిల్లాలకు అధ్యక్షులను ప్రకటిస్తామని పీసీసీ చీఫ్ వెల్లడించారు.
Also Read: Moles: పుట్టుమచ్చల వలన క్యాన్సర్ వస్తుందా ? దీనిలో నిజమెంత?
