BC Reservations: బీసీ రిజర్వేషన్ల పేటెంట్ రైట్
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిదే
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్ పూర్, స్వేచ్ఛ: తెలంగాణ సాయుధ పోరాట పేటెంట్ రైట్ కమ్యూనిస్టులది, విప్లవ ఉద్యమాలకు పేటెంట్ రైట్ నక్సలైట్లది, తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చినప్పటికీ పేటెంట్ రైట్ కేసీఆర్ది అన్నట్టుగా బీసీ రిజర్వేషన్ల (BC Reservations) పేటెంట్ రైట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల కోసం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో సంఘటన్ సృజన అభియాన్ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్ని శ్రీహరి మాట్లాడారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. గత 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదని ఆరోపించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ పైసా ఇచ్చింది లేదు, ప్రాజెక్టులు తెచ్చింది లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ వనరులను కొల్లగొట్టిందని, భూ కబ్జాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. పదేళ్లలో చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయట కొస్తున్నాయని, కేసీఆర్, హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో దోషులుగా నిలుస్తారని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.
కేటీఆర్ ఈ-కారు రేస్ కేసులో, కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారని కడియం మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిందని, పంట రుణాలు, రైతు భరోసా, ఎస్సీ రిజర్వేషన్ అమలు, మహాలక్ష్మి పథకం, ఉచిత సన్న బియ్యం, రేషన్ కార్డులు పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు మొదలైన పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఏఐసీసీ పరిశీలకులు పట్నాయక్, షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య, పీసీసీ పరిశీలకులు ఎండీ అవేజ్, శ్రీకాంత్, అనిల్ కుమార్, జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావణ్య శిరీష్ రెడ్డి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
