SRSP Stage 2: రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు ప్రకటించిన ముఖ్యమంత్రి
సూర్యాపేట,స్వేచ్ఛ: మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సీనియర్ నేతలు వి.హనుమంతరావు, ఎమ్మెల్యేలు మందుల సామేలు, ఉత్తమ్ పద్మావతి రెడ్డి, ఎంపీలు కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డిలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతానికి దామోదర్ రెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ జెండాను ఎగరవేసిన గొప్ప నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి అని సీఎం గుర్తుచేశారు. రాజకీయాల్లో నేడు ప్రతి ఒక్కరూ ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, కానీ రాంరెడ్డి దామోదర్ మాత్రం తండ్రి నుంచి వచ్చిన ఆస్తుల్ని పేదలకు పంచారని ప్రశంసించారు. తన అత్తంటి కుటుంబానికి చెందిన ఆస్తులను కూడా వేలాది ఎకరాలను తుంగతుర్తి ప్రజలకు దానం చేశారని రేవంత్ రెడ్డి ప్రశంసించారు.
Read Also- Fake Toothpaste: వామ్మో ఇంత మాయాజాలమా?.. టూత్ పేస్టులు వాడేవారికి వణుకుపుట్టింటే విషయం ఇదీ!
రాం రెడ్డి దామోదర్ రెడ్డికి సంతాపం తెలియజేయాల్సిందిగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేలు సూచించారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వారి తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. దామోదర్ రెడ్డి కుటుంబానికి ఏఐసీసీ అన్ని విధాలా అండగా ఉంటుందని, గాంధీ కుటుంబం దామోదర్ రెడ్డి కుటుంబానికి సహాయం చేస్తుందని అన్నారు. ఎస్సారెస్పీ నీళ్లు కరువు ప్రాంతమైన తుంగతుర్తికి తీసుకుని రావడంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. కరువు ప్రాంతమైన ఫ్లోరైడ్ ప్రాంతమైన తుంగతుర్తిలో గోదావరి జలాలు తీసుకురావడానికి పాటుపడి నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ను ఒప్పించి నీళ్లు తీసుకొచ్చిన రామిరెడ్డి దామోదర్ రెడ్డి పేరును ఎస్ఆర్ఎస్పీ స్టేజ్-2 కాలువకు (SRSP Stage 2) పెడుతున్నట్లు ఈ సందర్భంగా ప్రజల హర్షద్వారాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Read Also- Pak Afghan Clashes: పాక్పై ఆఫ్ఘనిస్థాన్ ప్రతీకార దాడులు.. ఏకంగా 58 మంది పాక్ సైనికులు మృతి
