Adluri Laxman: ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్లలో నాణ్యత, పారదర్శకతతో పాటు బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) పేర్కొన్నారు. ఆయన సచివాలయంలోని తన ఛాంబర్లో వెల్ఫేర్ హాస్టళ్ల పరిస్థితులపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి (Adluri Laxman)మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు అత్యుత్తమ ప్రమాణాలతో ఉండాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పేద, బలహీన వర్గాల విద్యార్థుల కోసం శుభ్రమైన వసతి, పోషకాహార భోజనం, పరిశుభ్రమైన వంటగదులు, సురక్షితమైన త్రాగునీటి సదుపాయం తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
Also Read: CMD Musharraf Farooqui: వచ్చే సమ్మర్లో విద్యుత్ డిమాండ్ పై యాక్షన్ ప్లాన్.. కీలక అంశాలపై చర్చ!
అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలి
సంక్షేమ హాస్టళ్లలో ఆహార నాణ్యత, సరఫరా, క్వాలిటీ కంట్రోల్పై అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని మంత్రి ఆదేశించారు. జిల్లా అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు చేసి, విద్యార్థుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటిని సాధ్యమనంతా మేరకు వెనువెంటనే పరిష్కరించాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లకు పంపిణీ చేసేందుకు నిర్వహించే ప్రొక్యూర్మెంట్ టెండర్ విధానంలో సూచించిన విధంగా అన్ని రకాల సరఫరాలు ఆహార పదార్థాలు , వంట సామగ్రి, హాస్టల్ అవసరాలకు అవసరమైన వస్తువులు పారదర్శకంగా, నాణ్యతతో పాటు సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
విద్య, సంక్షేమం, సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం
రాష్ట ప్రభుత్వం దళిత గిరిజన బలహీన వర్గాల అభివృద్ధికి అభ్యున్నతికి కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల విద్య, సంక్షేమం, సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. హాస్టళ్ల ఆధునికీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు వ్యవస్థలు, డిజిటల్ మానిటరింగ్ మెకానిజమ్లు ఏర్పాటు చేయడం ద్వారా బాధ్యతా స్పృహ, భద్రత పెరగాలన్నారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం కొనసాగిస్తూ, హాస్టళ్లలో ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో ల సాంఘీక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుద్ధప్రకాశ్, కమిషనర్ క్షితిజా, ఎస్సీ ,ఎస్టీ ,మైనారిటీ గురుకుల సొసైటీ కార్యదర్శులు కృష్ణఆదిత్య, సీతాలక్ష్మి, షఫీయుల్లా తదితరులు పాల్గొన్నారు.
Also Read: Breakfast Scheme: ప్రభుత్వ స్కూళ్లలో టిఫిన్.. సర్కార్ కీలక నిర్ణయం!
