- పార్లమెంట్ ఎన్నికల తర్వాత కనిపించకుండాపోయిన కేటీఆర్
- తెలంగాణ భవన్ కు రావడమే మానేసిన సారు
- ఇప్పటివరకూ లోక్ సభ ఫలితాలపై జరగని చర్చ
- పార్టీ క్యాడర్ లో పెరిగిపోతున్న అసంతృప్తి,
- విదేశాలకు వెళ్లారా? అజ్ణాతంలో ఉండిపోయారా?
- పార్టీలో ఏం జరుగుతోందో తెలియని గందరగోళం
- యువనేత తీరుపై కార్యకర్తలలో ఆగ్రహం
KTR not coming before public after parliament elections:
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు అంతా ఆ యువరాజుదే హవా..అదిగో గెలిచేస్తున్నాం..ఇదిగో వచ్చేస్తున్నామంటూ ఊదరగొట్టారు. కాంగ్రెస్ సర్కార్ ఎక్కువ కాలం ఉండబోదని జాతకం కూడా చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ సర్కార్ మాయమైపోతుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తమకు టచ్ లో ఉన్నారన్నారు. తీరా లోక్ సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా దక్కకపోవడంతో ఇన్ని మాటలు మాట్లాడిన ఆ యువరాజే కనిపించకుండా పోయాడు. ఇంతకీ ఆ యువరాజు ఎవరో కాదు కేటీఆర్.
ఎన్నికల తర్వాత గాయబ్
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. అప్పటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు పార్టీ లీడర్లకు, ఇటు కేడర్కు అందుబాటులో లేకుండా పోయారు. పార్టీ హెడ్ క్వార్టర్ అయిన తెలంగాణ భవన్కూ ఆయన రావడం మానేశారు. పార్టీ అధినేత కేసీఆర్ పిలిచినప్పుడు ఎర్రవల్లి ఫామ్హౌజ్కు వెళ్లడం, అక్కడ చర్చలు జరిపి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది.రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్క చోటా గెలవలేదు. దీనిపై ఇప్పటి వరకూ సమీక్ష నిర్వహించలేదు. ఓటమిపై బాధను పంచుకోవడానికి అభ్యర్థులకు సైతం ఆయన అందుబాటులో ఉండడం లేదు. ఓ వైపు అధినేతతో, మరో వైపు వర్కింగ్ ప్రెసిడెంట్తో కనెక్షన్ కట్ కావడంతో లీడర్లు, కేడర్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు.
అవమాన భారమా?
అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందోననే చర్చ మొదలైంది. ఓటమితో ప్రజలకు మొఖం చూపించుకోలేక కేటీఆర్ అవమాన భారంతో నేతలకు, శ్రేణులకు దూరంగా ఉంటున్నారా?.. లేక మీడియా సమావేశాలకు హాజరైతే సమాధానం చెప్పుకోలేని సంకట పరిస్థితుల్లో తప్పించుకుంటున్నారా?.. ఇవే ఇప్పుడు గులాబీ పార్టీలోని వివిధ స్థాయి నేతల మధ్య జరుగుతున్న చర్చలు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో షాడో చీఫ్ మినిస్టర్గా వ్యవహరించిన కేటీఆర్ లోక్సభ ఎన్నికల తర్వాత సైలెంట్గా ఉండిపోవడంతో ఆయన ఇక్కడే ఉన్నారా?.. లేక ఫారిన్ టూర్కు వెళ్లారా..? అనే సందేహం కొద్ది మందికి కలిగింది. గతంలో రాజకీయ నాయకులు విమర్శిస్తే ఘాటుగా తిప్పికొట్టే కేటీఆర్.. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత భిన్నంగా కనిపిస్తుండడం పార్టీ లీడర్లకు జీర్ణం కావడంలేదు. బీఆర్ఎస్ అవయవదానం చేసి, సొంత త్యాగం చేసి బీజేపీని బతికించిందంటూ సీఎం రేవంత్రెడ్డి సూటిగా విమర్శలు చేసినా కేటీఆర్ మాత్రం మౌనంగానే ఉండిపోయారు.
లోకల్ ఎన్నికలకైనా పుంజుకుంటారా?
పార్టీ మళ్లీ పుంజుకునేలా చేసేందుకు సంస్థాగతంగా చేపట్టాల్సిన మార్పులపై కేసీఆర్, కేటీఆర్ కలిసి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా?.. ఏకకాలంలో బీజేపీ, కాంగ్రెస్లను ఢీకొట్టే స్ట్రాటెజీలకు పదును పెడుతున్నారా?.. లేక పార్టీ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నడూ లేనంతటి ఘోర పరాజయాన్ని మూటగట్టుకొని తలెత్తుకోలేని పరిస్థితుల్లో స్కిప్ చేస్తున్నారా?.. ఇవీ కేడర్ నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు. అటు అధినేతను, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ను కలిసే పరిస్థితులు లేనప్పుడు ఇక పార్టీ ఎలా బతికి బట్ట కడుతుందనే సందేహాలు గులాబీ లీడర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలనాటికైనా కేడర్ను దిశానిర్దేశం చేసే బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్నది సమాధానం లేని ప్రశ్నగా మారిపోయింది.