Thummala Nageswara Rao: రైతులకు పత్తి తేమ శాతంపై పూర్తి అవగాహన ఉన్నదని, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు రైతులకు పూర్తిగా అవగాహన కల్పిస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) తెలిపారు. పత్తి కొనుగోళ్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందనకు ఒక ప్రకటనలో ధన్యవాదాలు అంటూ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు సీసీఐ ప్రతినిధులతో చర్చలు జరిపిందని, కొత్త నిబంధనలు రూపొందించే ముందు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నట్లయితే, ఇలాంటి ప్రతిష్టంభనలు వచ్చేవి కావన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో జిన్నింగ్ మిల్లులు టెండర్లలో పాల్గొనడానికి ముందుకు వచ్చాయన్నారు.
Also Read: Local Body Elections: బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే పాత విధానమే!.. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారు
ప్రధాన పంటల సాగు, దిగుబడిలో తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోళ్లకు సహకారం అందించడం లేదని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన పత్తి మద్దతు ధరరైతుల సాగువ్యయాలకు తగ్గట్టు లేదని వ్యాఖ్యానించారు. 2021, 2022లో కూడా రైతులు ప్రైవేట్గా అమ్ముకున్న ధర కంటే తక్కువగానే ఉందన్నారు. 2010లోనే క్వింటాలుకు రూ.6000 ధర దక్కిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. గత పదేళ్లలో పెరిగిన ఉత్పత్తి వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుత మద్దతు ధర తగినదిగా లేదన్నారు. దీనికి సంబంధించి గత నెలలో సీఏసీపీ చైర్మన్ ను కలిసి కూడా లేఖ అందజేసినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్ని పంటలు కొనుగోలు చేస్తోంది?
మద్దతు ధర ప్రకటించిన పంటలలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని పంటలు కొనుగోలు చేస్తోంది? కేంద్ర ప్రభుత్వం తరపున కొనుగోలు చేసే కంది, పెసర, సోయాబీన్ పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసేటప్పుడు విధించే 25% సీలింగ్ పరిమితిని ఎత్తివేసి, మొత్తం పంట సేకరణకు అనుమతి ఇవ్వగలదా? అని ప్రశ్నించారు. మొక్కజొన్న, జొన్న పంటలను కూడా కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసే విధంగా కేంద్రం ముందుకు రావాలని, ఈ విషయంలో కిషన్ రెడ్డి చొరవ చూపాలని కోరారు. ఇకనైనా సీసీఐ ప్రతినిధులు టెండర్లు, జిన్నింగ్ మిల్లులతో ఒప్పందాలు, నోటిఫికేషన్ వంటి ప్రక్రియలను వెంటనే పూర్తి చేసి త్వరిత గతిన కొనుగోళ్లకు సిద్ధం కావాలని కోరారు.
