VC Sajjanar: పీపుల్స్ వెల్ఫేర్ పోలీసింగ్ కే తన మొదటి ప్రాధాన్యత అని హైదరాబాద్(Hyderabad) కమిషనర్ వీ.సీ.సజ్జనార్(VC Sajanar) చెప్పారు. ఇది ప్రజల భద్రతకు దోహద పడుతుందన్నారు. హైదరాబాద్ కొత్వాల్ గా ఇటీవలే పగ్గాలు చేపట్టిన సజ్జనార్ సోమవారం మాదన్నపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు భద్రత, మహిళలు, చిన్నపిల్లల రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, 24/7 సిటిజన్ సర్వీసెస్, సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. అదే సమయంలో సైబర్, ఆర్థిక నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన..
పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా చూడటం సిబ్బంది అందరి బాధ్యత అని చెప్పారు. క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. అదే సమయంలో తప్పు చేసే అధికారులు, సిబ్బందిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్టేషన్ కు వచ్చే ప్రతీ ఫిర్యాదీతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కేసుల నమోదులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని కనబరచ వద్దని చెప్పారు. మహిళలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే వెంటనే కేసులు నమోదు చేసి సత్వరమే విచారణ జరపాలన్నారు.
Also Read: Supreme Court: సుప్రీంకోర్టులో షాకింగ్ ఘటన.. సీజేఐ గవాయ్పైకి బూటు విసరబోయిన లాయర్
సీపీకి కృతజ్ఞతలు..
ఇటీవల మాదన్నపేట స్టేషన్ పరిధిలో ఏడేళ్ల చిన్నారి సుమయ దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో పకడ్భంధీగా విచారణ జరిపిన మాదన్నపేట పోలీసులు బాలిక మేనమామ..అతని భార్య కలిసి ఈ కిరాతకానికి ఒడిగట్టినట్టుగా నిర్ధారించారు. ఈ క్రమంలో ఇద్దరిని అరెస్ట్ కూడా చేశారు. ఆకస్మిక తనిఖీ కోసం కమిషనర్ సజ్జనార్ మాదన్నపేట స్టేషన్ కు వచ్చిన విషయం తెలిసి సుమయ తండ్రి అజీముద్దీన్ ఫారూక్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తన కూతురి హత్య కేసులో నిందితులను కొన్ని గంటల్లోనే అరెస్ట్ చేయటంపై ధన్యవాదాలు తెలిపారు.
సున్నిత ప్రాంతాల సందర్శన..
అనంతరం కమిషనర్ సజ్జనార్ మాదన్నపేట స్టేషన్ పరిధిలోని సున్నిత ప్రాంతాలను సందర్శించారు. పికెట్లను తనిఖీ చేశారు. దాంతోపాటు సీసీ కెమెరాల పనితీరును సమీక్షించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. కమిషనర్ తోపాటు జాయింట్ సీపీ (లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్భాల్, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ అపూర్వ రావు, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్, అదనపు డీసీపీ శ్రీకాంత్, ఏసీపీ వెంకట్ రెడ్డి, సీఐలు ఆంజనేయులు, శ్రీను నాయక్ ఉన్నారు.
Also Read: Rangareddy: ఆ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్.. ఆన్లైన్ బుకింగ్ ద్వారా అక్రమ వ్యాపారం!
