Congress Govt: కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతు కీలక వ్యాఖ్యలు చేశారు. గురుకుల, ఏఈఈ అభ్యర్థులు ఆందోళన పడొద్దని, కొందరు రాజకీయ లబ్ది కోసమే విద్యారథులను, నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని సీరియస్ అయ్యారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఏదైనా సమస్య ఉంటే, ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దగ్గరికి రావాలని సూచించారు. 15 రోజుల్లో వారి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడా ఒక్క ఇబ్బంది రాకుండా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించామని చెప్పారు. ఇక నీట్ను తాము వ్యతిరేకిస్తున్నామని, ఈ పరీక్ష ఎంతో మంది విద్యార్థుల పాలిట శాపంగా మారిందని తెలిపారు. అందుకే హైదరాబాద్ వేదికగా నీట్ పై నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు.
బీఆర్ఎస్ పాలనపై విమర్శలు సంధిస్తూ గత పదేళ్లు రాష్ట్రంలో గడీల పాలన సాగితే.. రేవంత్ రెడ్డి వచ్చాక గడీల పాలనకు స్వస్తి పలికారని ఎమ్మెల్సీ వెంకట్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రజా పాలన మొదలైందని, ఏసీలకు అలవాటుపడ్డ నేతలు, పింక్ మీడియా తమపై తప్పుడు ప్రచారానికి పూనుకున్నారని విమర్శించారు. కొత్త యూట్యూబ్ చానెల్స్ పెట్టి నెలకు రూ. 3 లక్షలు ఇస్తున్నారని, గతంలోనే క్రిషాంక్ ఫేక్ జీవోలు తయారు చేసి జైలుకు పోయాడని గుర్తు చేశారు.
టీఎస్కు బదులు టీజీగా మార్చినందుకు వేల కోట్లు ఖర్చవుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తప్పుడు జీవో కాపీలు తయారు చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. టీజీ నుంచి టీఎస్గాత మార్చినందుకు రూ. 4630 కోట్లు ఖర్చవుతుందని ప్రచారం చేస్తున్నారని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ప్రధాన ప్రతిపక్ష నేతలు ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, అబద్ధాలు కాదని హితవు పలికారు. దీని వెనుక కేటీఆర్ ఉన్నాడని ఫైర్ అయ్యారు. ఇంట్లో కూర్చుని ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.