RV Karnan: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటేషన్లపై వచ్చి తిష్ట వేసిన అధికారులకు త్వరలోనే కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnan) ఝలక్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఇతర డిపార్ట్ మెంట్ల నుంచి డిప్యూటేషన్లపై వచ్చి జీహెచ్ఎంసీ(GHMC)లో విధులు నిర్వహిస్తున్న అధికారులను వారి మాతృశాఖకు పంపించేందుకు రంగం సిద్దమైనట్లు తెలిసింది. దీంతో పాటు జీహెచ్ఎంసీ కార్పొరేషన్ కు చెందిన ఉద్యోగుల్లో ఒకే సీటులో మూడేళ్ల పదవీ కాలం దాటిన ఉద్యోగులకు కూడా స్థానచలనం కల్గించాలని కమిషనర్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ లో ఇతర విభాగాల నుంచి వచ్చిన వారితో పాటు జీహెచ్ఎంసీకి చెందిన ఉద్యోగుల్లో చాలా మంది రెండు దశాబ్దాల నుంచి ఒకే సీటులో కొనసాగుతూ పలు రకాల అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ట్రాన్స్ పోర్టు విభాగంలో కొందరు ఫోర్ మెన్లు పది నుంచి పదమూడేళ్ల నుంచి అక్కడే తిష్ట వేసి పలు రకాల అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించినట్లు సమాచారం.
అధికారులకు ఝలక్..
ఫైనాన్స్ విభాగంలో చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్ గా విధులు నిర్వహిస్తున్న అధికారి సుమారు ఎనిమిదేళ్ల నుంచి జీహెచ్ఎంసీలోనే విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు త్వరలోనే ఇలాంటి అధికారులకు ఝలక్ ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. డిప్యూటేషన్ అధికారులతో పాటు జీహెచ్ఎంసీకి చెందిన సీనియర్ అసిస్టెంట్ మొదలుకుని డిప్యూటీ కమిషనర్ల వరకు, మెడికల్ ఆఫీసర్లు, ఇంజనీర్లతో పాటు ప్రతి ఒక్కరు విధుల్లో చేరిన తేదీ, సంవత్సరంతో కూడిన వివరాలను సమర్పించాలని కమిషనర్ ఇప్పటికే అదనపు కమిషనర్ (పరిపాలన)ను ఆదేశించినట్లు సమాచారం. అంబర్ పేట, ముషీరాబాద్, చార్మినార్, ఖైరతాబాద్, సికిందరాబాద్ సర్కిళ్లలో చాలా మంది అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు దశాబ్దాలుగా ఒకే చోట కొనసాగుతుండగా, సంతోష్ నగర్ సర్కిల్ లో మరి కొందరు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ల్లు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు దశాబ్దాల నుంచి నియామకం జరిగిన చోటే కొనసాగుతున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆ అదనపు కమిషనర్ జీహెచ్ఎంసీలోని విభాగాల వారీగా మూడేళ్లకు పైగా ఒకే సీటులో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, అధికారులు, ఇంజనీర్లు, మెడికల్ ఆఫీసర్లతో పాటు టౌన్ ప్లానింగ్ అధికారుల లెక్క తేల్చనున్నారు.
Also Read: Karur stampede FIR: విజయ్కు బిగ్ షాక్.. తొక్కిసలాట ఘటన ఎఫ్ఐఆర్ లీక్.. వెలుగులోకి షాకింగ్ అంశాలు
బదిలీలెందుకు మినహాయిస్తారు?
చాలా సర్కిళ్లలో సీనియర్ అసిస్టెంట్ మొదలుకుని సూపరింటెండెంట్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లకు ఇప్పటి వరకు తమ సర్వీసులో బదిలీలు జరగలేదని తెల్సింది. దశాబ్దాలుగా ఇలాంటి అధికారులు, సిబ్బంది ఒకే చోట కొనసాగటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీరిపై పలు రకాల ఆరోపణలున్నా, అవి సర్కిల్ స్థాయికే పరిమితమవుతుండటం, కమిషనర్ దృష్టికి రాకపోవటంతో వీరిపై చర్యలు తీసుకునే నాధుడే కరవయ్యాడన్న వాదనలున్నాయి. డిప్యూటీ కమిషనర్, ఆపై జోనల్ కమిషనర్లు ఎవరొచ్చినా, వీరు మేనేజ్ చేసుకుని అదే పదవీలో కొనసాగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా చాలా మంది పైరవీలు చేసుకోంటూ కొనసాగుతుండగా, మరి కొందరు ఎంతో చాకచక్యంగా వ్యవహారిస్తూ తమపై అధికారులకు అక్రమార్జన మార్గాలను చూపుతూ తమ సీట్లను పదిలం చేసుకుంటున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ఇలాంటి వివరాలను ప్రస్తుతం అడ్మిన్ సెక్షన్ సేకరిస్తుంది. త్వరలోనే ఇలాంటి వారి సీట్లు కూడా కదలే అవకాశాలున్నాయి. ఒక సీటులో మూడేళ్లు దాటిన వారికి ఖచ్చితంగా స్థానచలనం కల్గించాలని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ధృడ సంకల్పంతో ఉన్నట్లు సమాచారం.
డిప్యూటేషన్ రూల్స్ కు తూట్లు
సాధారణంగా జీహెచ్ఎంసీలోకి డిప్యూటేషన్ పై వచ్చి విధులు నిర్వహిస్తున్న అధికారుల్లో చాలా మంది మూడేళ్ల డిప్యూటేషన్ పీరియడ్ పూర్తి చేసుకున్న తర్వాత వారి మాతృ శాఖ, జీహెచ్ఎంసీ కమిషనర్ అంగీకరిస్తేనే మరో రెండేళ్లు అంటే మొత్తం గరిష్టంగా అయిదేళ్లు పాటు విధులు నిర్వహించాలన్న నిబంధన ఉంది. కానీ చాలా మందిు అధికారులు మాతృశాఖ ఉత్తర్వులను పట్టించుకోకుండా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను మేనేజ్ చేసుకునో, సచివాలయ స్థాయిలో పైరవీలు చేసుకునో అదే పదవీలో కొనసాగుతున్నారు. ఇలాంటి వారు చాలా రకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇటీవలే కమిషనర్ గుర్తించి, మూడేళ్ల దాటిన వారందర్నీ తమ మాతృశాఖలకు పంపించేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గరిష్టంగా అయిదేళ్లు డిప్యూటేషన్ పీరియడ్ పూర్తి చేసుకున్న తర్వాత మాతృశాఖలో రిపోర్టు చేసి, అక్కడ ఏడాది పాటు విధులు నిర్వర్తించి, మళ్లీ డిప్యూటేషన్ కు ప్రయత్నం చేసుకునే అవకాశమున్నా, ఈ దిశగా ఏ ఒక్క అధికారి ప్రయత్నాలు చేయకుండా నిబంధనలకు విరుద్దంగా జీహెచ్ఎంసీలోనే కొనసాగుతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు.
Also Read: Viral News: అమ్మకు బాలేదని లీవ్ అడిగిన ఉద్యోగి.. అందరి తల్లులు పోయేవారే.. డ్రామా చేయకంటూ బాస్ ఫైర్