TG DGP: తెలంగాణ డీజీపీ జితేందర్ పదవీ విరమణ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని నేషనల్ పోలీసు అకాడమీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనకు గౌరవందనం సమర్పించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ తన సర్వీసులో ఏం సాధించానో.. ఏమి కోల్పోయానో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కుటుంబం గురించి మాట్లాడుతూ పోలీసు బాస్ కంటతడి పెట్టడం అక్కడి వారిని భావోద్వేగానికి గురిచేసింది.
డీజీపీ ఏమన్నారంటే?
పదవి విరమణ కార్యక్రమంలో డీజీపీ జితేందర్ ముందుగా తన పోలీసు సర్వీసు గురించి మాట్లాడారు. ’33 ఏళ్ల పాటు సర్వీసు లో ఉన్నాను. నేషనల్ పోలీస్ అకాడమీలో మెుదట నాకు ఏపీ క్యాడర్ ను అలాట్ చేశారు. పంజాబ్ కు చెందిన నాకు.. ఏపీ కేటాయించినందుకు మొదట కాస్త భయపడ్డ. కానీ ఇక్కడి అధికారులు నాకు ఎంతో సహకరించారు. 40 ఏళ్లలో 40 రోజులు కూడా సొంత ఊరిలో లేను. డీజీపీ గా అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని డీజీపీ అన్నారు.
ఘనంగా డీజీపీ జితేందర్ పదవీ విరమణ కార్యక్రమం
తెలంగాణ పోలీస్ అకాడమీలో ఫేర్వెల్ పరేడ్ నిర్వహించిన రాష్ట్ర పోలీసులు
వీడ్కోలు కార్యక్రమానికి హాజరైన నూతన డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు pic.twitter.com/WH80qa6XHV
— BIG TV Breaking News (@bigtvtelugu) September 30, 2025
‘క్రైమ్ రేట్ తగ్గింది’
గత 15 నెలలుగా హైదరాబాద్ సహా తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని డీజీపీ జితేందర్ తెలిపారు. క్రైమ్ రేట్ కూడా తగ్గిందని పేర్కొన్నారు. ఫలితంగా జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీస్ కు మంచి గుర్తింపు వచ్చిందని గుర్తుచేశారు. కమ్యునల్, నక్సల్, టెర్రర్ లాంటి ఘటనలకు తావు లేకుండా చూశామని చెప్పారు. కామారెడ్డి, నిజామాబాద్ ప్రాంతాల్లో వరదలు వస్తే 24 గంటల్లో అందరినీ కాపాడి ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నామని గుర్తుచేశారు. అటు నార్కోటిక్స్, సైబర్ క్రైమ్ లతో నిరంతరం యుద్ధం చేస్తున్నామని తెలిపారు.
నేరాల ఛేదనలో టెక్నాలజీ కీలకం
తెలంగాణ పోలీస్ కేవలం మన రాష్ట్రం కోసమే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ క్రైమ్ జరగకుండా చర్యలు తీసుకుందని డీజీపీ జితేందర్ అన్నారు. ‘బెట్టింగ్ మాఫియా పై లోతుగా ముందుకు వెళ్తున్నాం. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశాం. ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ నంబర్ 1 లో ఉంది. 113 డీఎస్పీ లకు రెండు రోజుల క్రితమే పోస్టింగ్ ఆర్డర్ లు ఇచ్చాం. నేరాల ఛేదనలో టెక్నాలజీ చాలా కీలకంగా మారింది. 10 లక్షల సీసీ కెమెరాలు రాష్ట్రంలో పని చేస్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన అన్ని సెన్షనల్ కేస్ లు కేవలం 48 గంటల్లోనే చేధించగలిగాం.. ఇది ఒక రికార్డ్’ అని డీజీపీ అన్నారు.
‘కొత్త డీజీపీపై నమ్మకముంది’
నేర పరిశోధనలో టెక్నాలజీకి ప్రాధాన్యం ఏర్పడినప్పటికీ పూర్తిగా దాని మీదనే ఆధారపడకూడదని.. డీజీపీ జితేందర్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ మీదే మొత్తం డిపెండ్ అవకూడదు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా కావాలి. శివధర్ రెడ్డి (కాబోయే డీజీపీ)కు చాలా అనుభవం ఉంది. ఇంటలిజెన్స్, లా అండ్ ఆర్డర్ తో పాటు మావోయిస్ట్ లపై శివధర్ రెడ్డి కి చాలా అనుభవం ఉంది. శివధర్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మరింత బలపడుతుందని నాకు నమ్మకం ఉంది’ అని జితేందర్ అన్నారు.
Also Read: Viral News: అమ్మకు బాలేదని లీవ్ అడిగిన ఉద్యోగి.. అందరి తల్లులు పోయేవారే.. డ్రామా చేయకంటూ బాస్ ఫైర్
జితేందర్ కంటతడి
ఈ క్రమంలోనే తన కుటుంబం గురించి గుర్తుచేసుకున్న డీజీపీ జితేందర్.. ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబం గురించి మాట్లాడుతూ కంటతడిపెట్టారు. ‘రీసెంట్ గా నా తండ్రి చనిపోయారు. నన్ను అర్థం చేసుకుని నాకు సహకరించిన నా భార్య, పిల్లలకు కృతజ్ఞతలు. తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోయాను. ఉద్యోగ రీత్యా ఫ్యామిలీ బంధువులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అర్థం చేసుకున్నారు అని అనుకుంటా’ అని డీజీపీ జితేందర్ కన్నీరు పెట్టుకున్నారు.