Janagama: సబ్బు బిల్లా.. కుక్క పిల్లా.. కవితకు కాదేది అనర్హం అన్నట్లుగా బెట్టింగు రాయుళ్లకు ఏదైనా ఒక్కటే. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు (Telangana Local Body Elections) జరుగుతాయా.. జరుగవా.. అనేది చర్చనీయాంశం. ఈ ఎన్నికలను వేదికగా చేసుకుని బెట్టింగు రాయుళ్ళు గ్రామాల్లో జోరుగా పందాలు కాస్తున్నారు. ఊరు వాడ నుంచి మండల జిల్లా కేంద్రాల వరకు ఈ బెట్టింగుల జోరు ఉందని రాజకీయ నేతలే అంటున్నారు. ఎన్నికలు జరుగుతాయి అని ఒక వర్గం పందెం కాస్తే, కాదు కాదు.. అస్సలు ఎన్నికలు జరుగవు అని మరో వర్గం పందెం కాస్తుంది. హైకోర్టు అక్టోబర్ 8 వరకు వాయిదా వేయడంతో ఇప్పుడు హైకోర్టు ఎన్నికలు అడ్డుకుంటుందని ఒక వర్గం వాదిస్తే.. అంతకు ముందే ఎన్నికల కమీషనర్ ఎన్నికల నోటిఫికేషన్ వేస్తారని, ఎన్నికలు యధావిథిగా జరుగుతాయని మరొక వర్గం వాదిస్తుంది. ఎవ్వరి వాదనలు ఎలా ఉన్నా బెట్టింగు రాయుళ్ళు మాత్రం తమ బెట్టింగులను మూడు సీట్లు, ఆరు నోట్లు అన్న చందంగా ముందుకు సాగుతున్నారు.
Also Read- Thaman S: ‘ఓజీ 2’ మాత్రమే కాదు.. ఇంకా చాలా పార్ట్స్ వస్తాయ్..
రిజర్వేషన్లు మారుతాయా..?
బెట్టింగు రాయుళ్ళు ఫోన్లలోనే బెట్టింగులు కట్టేస్తున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ కొందరు గ్రూపులుగా ఏర్పడి రహాస్యంగా బెట్టింగు నిర్వహిస్తున్నారు. బీరు నుంచి మొదలు పెడితే వేల రూపాయలు ఈ బెట్టింగుల్లో బెట్టింగులు పెట్టేందుకు ఔత్సాహికులు పాల్గొంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఈనెల 30 వరకు అవకాశంగా నిర్వహించింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్లు ఎన్నికల నిర్వహణపై ఎవ్వరి పని వారు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికలు నిర్వహించకుంటే సుప్రింకోర్టు నిర్ణయాన్ని ధిక్కరించినట్లు అవుతుందనే సాకుతో హడావుడిగా ఎన్నికల ప్రక్రియను షురూ చేసిందని కొందరు వాదిస్తున్నారు. కోర్టు ధిక్కరణ ఎదుర్కొనే కంటే ఎన్నికల సన్నాహాలు మొదలు పెడితే బాగుంటుందనే.. సర్కారు ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకుపోతుందనే అపవాదు లేకపోలేదు. ఈ తరుణంలో ఈనెల 27న స్థానిక రిజర్వేషన్ల ప్రక్రియను ముగించింది. జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలకు నోటిఫికేషన్ వేయకుండానే బీసీ రిజర్వేషన్లకు జీవో ఇచ్చింది. ఇక స్థానిక సంస్థల రిజర్వేషన్లను కలెక్టర్లు, ఆర్డీఓల స్థాయిలో ప్రకటించారు.
Also Read- Puri Jagannadh: తమిళనాడులో తొక్కిసలాట.. డైరెక్టర్ పూరి జగన్నాధ్ సంచలన నిర్ణయం
రాజకీయ నాయకుల వాదన ఇదే..
అయితే బీసి రిజర్వేషన్లు ప్రకటించడం, స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించడంతో ఓసీలకు తీరని అన్యాయం జరిగిందనే ప్రచారం సాగుతుంది. దీంతో మాధవరెడ్డి అనే వ్యక్తి బీసీ రిజర్వేషన్లపై హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు కేసును అక్టోబర్ 8కి వాయిదా వేసింది. ఇప్పుడు హైకోర్టు ఏమీ తీర్పు ఇస్తుందో అనే మీమాంసలో రాజకీయ నాయకులు, ప్రజలు ఉన్నారు. హైకోర్టు బీసీ రిజర్వేషన్లు చెల్లవని తీర్పు ఇస్తుందని కొందరు, రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని కొందరు ఈ బెట్టింగులు కట్టిస్తున్నారు. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపినా గవర్నర్ ఇంకా దానిని ఆమోదించలేదని, రాష్ట్రపతి అమోదించాలని అప్పుడే ఇవి అమల్లోకి వస్తాయని రాజకీయ నాయకులు వాదించుకుంటున్నారు. అందుకే ఈ బిల్లుకు మోక్షం లభించదని, రిజర్వేషన్లు మారుతాయని బెట్టింగ్లు కడుతున్నారు. పనిలో పనిగా ఎన్నికల కమిషనర్ కూడా నోటిఫికేషన్ వేస్తారని కొందరు, వేయరని కొందరు చర్చించుకుంటున్నారు. ఈ చర్చ అన్ని రాజకీయ పార్టీల నేతల్లోనూ ఉంది. ఎమ్మెల్యేలు కూడా ఎన్నికల నిర్వహణపై క్యాడర్కు ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదని, అసలు ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదని అంటున్నారు. ఏదేమైనా పందెం రాయుళ్ళకు మాత్రం స్థానిక ఎన్నికలు భలే అవకాశం కల్పిస్తున్నాయని చెప్పవచ్చు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు