Harish Rao: ఆదాయం కోసం మద్యం ఏరులై పారిస్తారా? అని రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఫైర్ అయ్యారు. ఎక్స్ వేదికగా సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం అడ్డదారులు వెతుక్కుంటున్నదని,ప్రజలపై పన్నుల భారం మోపుతున్నదని ఆరోపించారు. 6 గ్యారంటీలు 420 హామీల ఊసు లేదు కానీ మద్యం ఆదాయం రెట్టింపు చేసుకునే దిశగా కొత్త పాలసీ తెచ్చారని ఆరోపించారు. కేసీఆర్(KCR) తెచ్చిన పథకాలకు కోతలు, ప్రజలకు పన్నుల వాతలు తప్ప 22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇప్పటికే మద్యం ధరలను ఇష్టారీతిగా పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా కొత్త పాలసీ తెచ్చిందని, ఇపుడు మద్యం షాపుల దరఖాస్తు ఫీజును ఏకంగా రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలకు పెంచారన్నారు.
బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని..
ఎన్నికలప్పుడు మాయ మాటలు – పాలనలోకి రాగానే మోసపు చేతలుఅని దుయ్యబట్టారు. ప్రజలపై ఆర్టీసీ(RTC) బస్సు చార్జీలు మోతలు.. వాహనాలపై పన్నుల భారం.. ఆర్ఆర్ టాక్స్ లు వేశారన్నారు. ప్రజలకు సంక్షేమం పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దె నెక్కగానే గరీబోళ్ల సంపాదనను కొల్లగొట్టే పథకాలు రచిస్తున్నారని మండిపడ్డారు. బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దాన్ని తుంగలో తొక్కి గ్రామ గ్రామాన మద్యం ఏరులై పారేలా చేసిందన్నారు.
Also Read: CM Revanth Reddy: తమిళనాడు మోడల్లో తెలంగాణ విద్యా రంగం.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆరోగ్యాలతో చెలగాటం..
ఊరూరికి మైక్రో బ్రూవరీ తెచ్చి తాగుబోతుల తెలంగాణ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అడ్డదారులు తొక్కడం, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడటం కాంగ్రెస్కు అలవాటుగా మారిందన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం తప్పదనే రీతిలో ఆనాడు బిల్డప్ ఇచ్చి ఈనాడు ఊరూరా మైక్రో బ్రూవవరీలు తెస్తున్నారన్నారు. మహిళలకు కల్యాణ లక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తానని ఇవ్వలేదు.. యువతులకు నెలకు 2500 ఇస్తానని ఇవ్వలేదు. ఇవేమీ చేయకుండా బెల్ట్ షాపులు పెంచి మహిళల ఉసురు పోసుకుంటున్నారన్నారు.
నీరా షాపును బంద్ చేసే కుట్ర
అప్పుల పాలైనా, గ్యారంటీల అమలు అయినా, మద్యం అమ్మకాలైనా ఏవైనా ప్రభుత్వానిది రెండు నాలుకల ధోరణి అని దుయ్యబట్టారు. గౌడ లకు వైన్ షాపుల్లో 25 శాతం రిజర్వేషన్లు అని ఊదరగొట్టి .. కేసీఆర్ ఇచ్చిన 15% రిజర్వేషన్ కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరాను ప్రోత్సహిస్తామన్నారు.. ఉన్న నీరా షాపును బంద్ చేసే కుట్ర చేశారన్నారు. గీత కార్మికులు ప్రమాదావశాత్తు చనిపోతే ఇచ్చే నష్టపరిహారాన్ని ఇప్పటివరకు చెల్లించడం లేదన్నారు. గౌడ్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, రాత్రికి రాత్రే మద్యం షాపులు ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించే వెసులుబాటు ఎందుకు కల్పించారు? అని నిలదీశారు. పల్లెపల్లెకు మద్యం చేర్చడంపై ఉన్న శ్రద్ధ పల్లెపల్లెకు వైద్యాన్ని అందించడంపై లేదని మండిపడ్డారు. మైక్రోబ్రూవరీల ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు.