– తాజ్ హోటల్లో ఇంటర్నేషనల్ రైస్ సమ్మిట్
– హాజరైన వివిధ దేశాల 150 మంది ప్రతినిధులు
– వితనోత్పత్తిలో ఆధునిక పరిజ్ఞానంపై చర్చ
– ఏ రకం వరి ధాన్యానికి డిమాండ్ ఉందో రైతులకు అవగాహన
– దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్నామన్న మంత్రి తుమ్మల
Minister Thummala nageshwara rao: మరో అంతర్జాతీయ కార్యక్రమానికి వేదికైంది హైదరాబాద్. తాజ్ హోటల్లో ఇంటర్నేషనల్ రైస్ సమ్మిట్ ప్రారంభమైంది. 22 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సదస్సులు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కమిడిటీ ఇన్స్టిట్యూట్, మొట్టమొదటిసారిగా మన దేశంలో, అదీ హైదరాబాద్లో ఈ సమ్మిట్ నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 150 ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. భారతదేశం నుంచి సీడ్ కంపెనీల ప్రతినిధులు, అభ్యుదయ రైతులు, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ హాజరయ్యారు.
ఈ సదస్సు వల్ల తెలంగాణలో వరి పండించే రైతులకు మేలు జరిగే విధంగా వంగడాలపై పలు సూచనలు ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ రకం వరి ధాన్యానికి డిమాండ్ ఉందో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమ్మిట్లో విత్తనోత్పత్తిలో ఆధునిక పరిజ్ఞానంపై చర్చిస్తున్నారు. ప్రపంచంలో 100 దేశాలకు భారత్ నుంచి రైస్ ఎగుమతి జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి రైతులకి ఈ సమ్మిట్ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సివిల్ సప్లై అండ్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సహా పలువురు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, దేశంలోనే తెలంగాణ అత్యధికంగా వరి ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. దాదాపుగా 200 రకాల వరిని పండిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో విదేశాలకు కూడా ఉత్పత్తి చేయడంలో తెలంగాణ ముందుంటుందని తెలిపారు. తెలంగాణ సోనా రైస్కు, విత్తనాలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉందన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా అన్నివేళలా టెక్నాలజీ పరంగా కూడా సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ, నీటి పారుదల సౌకర్యం తెలంగాణలో ఎక్కువగా కల్పించడం వల్ల వరి ఎక్కువగా ఉత్పత్తి అవుతుందన్నారు. అలాగే, ప్రభుత్వం వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ధర కల్పించాలని, ఇజ్రాయిల్ దేశం మాదిరిగా 50శాతం రైతుకి మనదేశంలోనూ ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పండించిన ధాన్యం విదేశాలకు ఎగుమతి చేయాలన్నారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులకు సబ్సిడీ క్వాలిటీ విత్తనాలు అందిస్తుందని చెప్పారు. తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా నిలిచిందని, వివిధ రకాల వరి వంగడాలను అత్యధికంగా తెలంగాణలో పండిస్తున్నామని తెలిపారు. ఎన్ఎస్ఎఫ్ యాక్ట్ ప్రకారం న్యూట్రిషన్ ఫుడ్ అందరికీ అందించాలని అన్నారు.