– కోడ్ ముగియటంతో తిరిగి అమలు
– గృహజ్యోతి స్కీమ్ కింద సున్నా బిల్లు
– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి
Zero Power Bill: తెలంగాణలోని గృహ జ్యోతి పథకానికి అర్హులైన అందరూ నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ఎన్నికల కోడ్ ముగిసినందున అర్హులైన అందరికీ నేటి నుంచి గృహజ్యోతి స్కీమ్ కింద సున్నాబిల్లులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ‘ప్రతి ఒక్కరికి సంక్షేమం’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు సున్నా బిల్లులను ప్రభుత్వం జారీ చేస్తుందని, అర్హులైన అందరికీ సంక్షేమం అందించబోతున్నామని పేర్కొన్నారు.
కాగా ఇంటి అవసరాల నిమిత్తం 200 యూనిట్లకంటే తక్కువ కరెంటు వాడుకునే వారికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఈ స్కీమ్ ను రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఫిబ్రవరి 27న సీఎం ప్రారంభించగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, సార్వత్రిక ఎన్నికల కోడ్ కారణంగా ఈ స్కీమ్ అమలు కాలేదు. ఇవాళ్టితో కోడ్ ముగియడంతో నేటి నుంచి సున్నా బిల్లులు జారీ చేస్తామని మంత్రి ప్రకటించారు.