– పట్టునిలుపుకున్న నాయకులు
– ఎమ్మెల్యే, ఎంపీగా జానారెడ్డి కొడుకులు
– కడియం ఎమ్మెల్యే, కూతురు కావ్య ఎంపీ
– ఖమ్మం ఎంపీగా సురేందర్ రెడ్డి వారసుడు
– శివరావు షెట్కార్ వారసుడు సురేష్ షెట్కార్ ఎంపీ
– చట్ట సభలోకి కాక మూడో తరం
Congress: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో సీనియర్లు తమ రాజకీయ వారసత్వాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువచ్చారు. ప్రాతినిధ్యం కల్పించడంలో సక్సెస్ అయ్యారు. కొందరు రెండో తరం నాయకులైతే మరికొందరు మూడో తరం నాయకులు ఈ ఎన్నికలతో కుటుంబ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన 8 స్థానాల్లో ఏడు స్థానాల్లో గెలిచిన అభ్యర్థులకు రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండటం గమనార్హం. ఈ రాజకీయ వారసుల వివరాలు ఇలా ఉన్నాయి.
40 ఏళ్ల తర్వాత మహిళా ఎంపీ
వరంగల్లో సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి ఈ ఎన్నికల్లో తన రాజకీయ వారసత్వాన్ని ముందుకు తెచ్చారు. కడియం శ్రీహరి కూతురు కావ్య 2,20,339 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ప్రచారంలోనే అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న కడియం కావ్య తన రాజకీయ ప్రస్థానాన్ని ఈ పదవితో పదిలం చేసుకుంటారని తెలుస్తున్నది. ఇక వరంగల్ గడ్డపై మహిళా ఎంపీగా 40 ఏళ్ల తర్వాత కావ్య రికార్డు తిరగరాశారు. 1984లో టీడీపీ నుంచి డాక్టర్ కల్పనాదేవి గెలిచారు. వీరిద్దరూ డాక్టర్లే కావడం మరో ఆసక్తికర విషయం.
ఇద్దరు కొడుకులు.. స్టేట్ ఒకరు, సెంట్రల్ ఒకరు
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి కొడుకులు ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న కొడుకు జైవీర్ నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా గెలుపొందగా.. తాజాగా పెద్ద కొడుకు రఘువీర్ నల్లగొండ ఎంపీగా 5,59,905 ఓట్ల భారీ మెజార్టీతో చారిత్రక విజయాన్ని నమోదు చేశారు. వీరిద్దరూ చట్టసభల్లోకి అడుగుపెట్టి జానారెడ్డి వారసత్వాన్ని నిలిపారు.
కాక వారసులు
గడ్డం వెంకటస్వామి (కాక) మూడోతరం వారసుడు చట్టసభలోకి ప్రవేశించారు. కాక కొడుకు గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో ఎంపీగా గెలిచారు. ఇప్పుడు వివేక్ కుమారుడు వంశీకృష్ణ 1,31,364 ఓట్ల మెజార్టీతో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు.
ఖమ్మం ఖిల్లాకు మరో రామసహాయం
డోర్నకల్ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ ఎంపీగా 4 సార్లు గెలిచి ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందిన రామసహాయం సురేందర్ రెడ్డి వారసుడు రామసహాయం రఘురాం రెడ్డి కూడా ఖమ్మం నుంచి భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు. 4,67,847 ఓట్ల భారీ మెజార్టీతో ఆయన తొలిసారి ఎంపీగా గెలిచారు.
షెట్కార్ వారసత్వం
పలుమార్లు ఎమ్మెల్యేగా పని చేసిన శివరావు షెట్కార్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కొడుకు సురేష్ షెట్కార్ రాణిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా చేసిన సురేష్.. తాజాగా 46,188 ఓట్ల మెజార్టీతో జహీరాబాద్ ఎంపీగా గెలిచారు.
మల్లురవి
మల్లు కుటుంబం నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు రవి మరోమారు ఆయన పట్టు నిలుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నాగర్ కర్నూల్ ఎంపీగా 94,414 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.