Harish Rao: ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఏమయ్యాయని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) నిలదీశారు. గ్రీన్ చానెల్ లో నిధుల విడుదల అన్న కాంగ్రెస్(Congress) ప్రభుత్వ మాటలు నీటి మూటలేనా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని కోకాపేటలోని ఆయన నివాసంలో ఫీజు రీయింబర్స్మెంట్ పై పోరుబాట అంటూ పీడీఎస్యూ(PDSU) రూపొందించిన బిగ్ డిబేట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో విద్యావ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని, చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి..
రెండేళ్లుగా రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని విద్యాసంస్థల యాజమాన్యాలు మొత్తుకుంటున్నా కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్ర నటిస్తుండటం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. దాదాపు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని, సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదా వేసే పరిస్థితి వస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అని నిలదీశారు. సోమవారం నుంచి నిరసనలు, నిరాహార దీక్షలు, నిరవధిక బంద్లు చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ ఎందుకు నోరు మెదపడం లేదు?’అల్లరి చేయొద్దు’ అని ఆర్థిక మంత్రి సుద్దులు చెప్పినంత మాత్రాన యాజమాన్యాలు, విద్యార్థుల గోడు తీరదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఫీజు రీయింబర్స్ ఇవ్వడానికి లేని డబ్బులు కమిషన్ల ప్రాజెక్టులకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు.
Also Read: GST 2.0: చిరు తిండ్లు తినేవారికి కేంద్రం గుడ్ న్యూస్.. ఇక మీ పంట పండినట్లే!
ఈ ప్రభుత్వానికి కమిషన్లు..
ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు డీఏ(DA)లు ఇవ్వమంటే ‘నన్ను కోసుకొని తిన్న పైసలు లేవు’ అని చెప్పిన ముఖ్యమంత్రి లక్షల కోట్ల టెండర్లు ఎలా పిలుస్తున్నాడు అని నిలదీశారు. విద్యార్థుల చదువు పట్ల నీకు శ్రద్ధ లేదా? విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆలోచన లేదా? విడతల వారీగా ఫీజు రీయింబర్స్ మెంటు బకాయిలు విడుదల చేస్తామని, ఏ ఏడాదికి ఆ ఏడాది క్లియర్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఒకవైపు కేసీఆర్ పై కక్షతో గురుకులాలను, మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా ఉన్నత విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి కమిషన్లు దండుకోవడంపై ఉన్న ధ్యాస, విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు పై లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC), మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికై బీఆర్ఎస్ మరో పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
Also Read: Taliban leader: విరాట్ కోహ్లీకి తాలిబన్ లీడర్ స్పెషల్ రిక్వెస్ట్.. ఏం కోరాడంటే?