Parliament: మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగి గెలుపొందిన డీకే అరుణ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ ఎన్నికల్లో గెలవడం సంతోషంగా ఉన్నదని, ప్రజలు తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలుపుకుంటానని వివరించారు. బీజేపీని ప్రజలు అక్కున చేర్చుకున్నారని తెలిపారు. అధిష్టానం ఏ పదవి ఇచ్చినా నిర్వర్తిస్తానని చెప్పారు. మంత్రి పదవి రావాల్సిందేనని డిమాండ్ చేయడం లేదని, అందుకోసం లాబీయింగ్ కూడా చేయబోనని స్పష్టం చేశారు.
ఎన్నికలు ముగిశాయి కాబట్టి, ఇక రాజకీయాలు పక్కనపెట్టాలని, అభివృద్ధి పై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి డీకే అరుణ సూచనలు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరస్పరం సమన్వయంలో పని చేయాలని అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను సక్రమంగా ఖర్చు పెట్టాలని చెప్పారు. పాలమూరు కరువు ప్రాంతం కాబట్టి, ఇక నైనా నీరు అందించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఆమె ప్రస్తావించారు. నీరు అందిస్తేనే వలసలు తగ్గుతాయని స్పష్టం చేశారు.
పాలమూరు-రంగారెడ్డిలో రంగారెడ్డి తీసివేయాలని, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం కొత్త డీపీఆర్ తయారు చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఇక డిండి ప్రాజెక్టు కోసం పాలమూరు నుంచి నీళ్లు తీసుకోవద్దని అన్నారు.
మహబూబ్నగర్ ఎన్నికల ఫలితాలు టీ20 మ్యాచ్ను తలపించాయని డీకే అరుణ అభిప్రాయపడ్డారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తనపై యుద్ధానికి వచ్చినట్టుగానే ప్రచారం చేసిందని, రిజర్వేషన్లపై హద్దుమీరి అబద్ధాలు ప్రచారం చేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, తాను ఒకే ఫ్లైట్లో వెళ్లినంత మాత్రానా కలిసిపోయినట్టు కాదని అన్నారు. కాంగ్రెస్ ఓటమికి కారణాలు వెతుకుతున్నదని, అందుకే బీజేపీతో బీఆర్ఎస్ కలిసిపోయిందనే కుంటిసాకును కారణంగా చెబుతున్నదని విమర్శించారు.
ఈ నెల 7వ తేదీన తాను ఢిల్లీకి వెళ్లుతున్నట్టు డీకే అరుణ వివరించారు. 8వ తేదీన పార్లమెంటు సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేస్తానని తెలిపారు.