Krishna Water Dispute: సెప్టెంబర్ 23న జరగనున్న కృష్ణా జలాల ట్రిబ్యునల్-2 విచారణలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు చెందాల్సిన నీటివాటాలో చుక్క నీరు కూడా వదులుకునే ప్రసక్తేలేదని ఆయన తేల్చిచెప్పారు. దిల్లీ వేదికగా జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తాను స్వయంగా పాల్గొన బోతున్నట్లు మంత్రి వెల్లడించారు.
‘దిల్లీకి సీఎం సైతం వస్తారు’
ఢిల్లీలో సెప్టెంబర్ 23- 25 మధ్య జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2 విచారణలో తెలంగాణా ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించేందుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జలసౌధలో న్యాయ నిపుణులు, నీటిపారుదల రంగ నిపుణులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జల వివాదం అంశంపై ఒత్తిడి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని దిల్లీకి వస్తారని మంత్రి అన్నారు. కృష్ణా జలాశయాలలో తెలంగాణా రాష్ట్ర వాటాను సాధించేందుకు బలమైన వాదనలు వినిపించేలా అధికార యంత్రాంగాన్ని సన్నద్దం చేశామని మంత్రి పేర్కొన్నారు. వారు ఇచ్చే నివేదికల ఆధారంగా న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రానికి చెందాల్సిన నీటివాటపై వాదనలు వినిపించనున్నారని పేర్కొన్నారు.
‘వాటిని ట్రిబ్యునల్ ముందు ఉంచాం’
KWDT ఎదుట 2025 ఫిబ్రవరి నుండి వాదనలు కొనసాగుతున్నాయని, సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయంపై ప్రస్తావించారని మంత్రి తెలిపారు. శాస్త్రీయంగా నీటి కేటాయింపులు, ఆంధ్రప్రదేశ్ చేపట్టిన అనధికార బేసిన్ ల వివరాలు, తెలంగాణ ప్రాంతంలో సాగునీటి అవసరాలు అందులో పొందు పరిచారని చెప్పారు. ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం కాలువల సామర్ధ్యాలను పెంచుకుంటూ గోదావరి, పట్టిసీమ, చింతలపూడి, పులిచింతల నీరు అక్రమంగా తరలించుకు పోతున్న అంశాలను ఇప్పటికే ట్రిబ్యునల్ ముందు ఉంచామన్నారు. 1956 జలవివాద చట్టం, 2014 ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిన విషయంపై వాదనలు వినిపించామన్నారు.
పెరిగిన నీటి అవసరాలకు అనుగుణంగా..
811 టీఎంసీల కృష్ణా జలాశయాలలో తెలంగాణా ప్రాంతానికి 71 శాతం కేటాయింపులు ఉండాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక్కడ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు 65% కేటాయింపులు ఉండాల్సిందేనన్నారు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లుగా నీటి కేటాయింపులు ఉండాలని అందుకు అనుగుణంగా తాజా సమాచారాన్ని ట్రిబ్యునల్ కు సమర్పించామని ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని జారవిడుచుకోబోమని ఆయన పునరుద్ఘాటించారు. ఇప్పటికే ట్రిబ్యునల్ ఎదుట వాదనలు పూర్తిగా వినిపించగా తాజాగా అధికారులు అందించే నివేదికతో రాష్ట్రానికి అడ్వాంటేజ్ ఉండొచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు.
త్వరలో ప్రత్యేక జీవో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా వినియోగిస్తున్న 291 టి.యం.సి ల నీటి ఉదంతం వెలుగులోకి వచ్చినందున ఆ నీటిని పునర్విభజన చేయాల్సిందేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణా లో కడుతున్న ప్రాజెక్టులపై సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్, నదుల నిర్వహణ బోర్డుల ఎదుట ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తుండటంతో ప్రాజెక్ట్ ల నిర్మాణంలో ఆలస్యం చోటుచేసుకుంటున్నట్లు మంత్రి అన్నారు. తమ వాదనలకు బలం చేకూరేలా ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణాల అంశాలతో కూడిన ప్రత్యేక జీ.ఓ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సన్నదమౌతోందని తెలిపారు. వీటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకాల సామర్ధ్యం పెంపుతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం త్రాగునీటి అవసరాల కోసం కొత్తగా నిర్మిస్తున్న రిజర్వాయర్ లు, 100 టి.యం.సి లను మళ్లించడానికి వీలుగా రూపకల్పన చేసిన జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్ లు ఉన్నాయన్నారు.
Also Read: Jupally Krishna Rao: డ్రగ్స్పై ఉక్కుపాదం.. అవసరమైతే ఆయుధాలు ఇస్తాం.. ప్రభుత్వం కీలక ప్రకటన
బీఆర్ఎస్ పై మండిపాటు
ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తి చేయక పోవడం వల్లనే కృష్ణా జలాశయాలను తెలంగాణ వినియోగించుకో లేక పోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత పాలకుల ఉదాసీనత వల్లే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుని పోయి ప్రయోజనం పొందిందని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుక్షణం నుండే న్యాయంగా తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై గట్టిపట్టు పడుతున్నామన్నారు. అందుకు తగిన ప్రణాళికలు రూపొందించి ముందుకు పోతున్నామన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ట్రిబ్యునల్ ఇప్పటికే గుర్తించిందని తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా కేటాయింపులను ఎట్టి పరిస్థితుల్లో సాధించి తీరుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.