Bathukamma 2025: ప్రతీ ఏటా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. ఈ ఏడాది వైభవంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం రూ.12 కోట్లు కేటాయించబోతున్నట్లు సమాచారం.అందుకు సంబంధించిన జీవోను రెండుమూడ్రోజుల్లో ప్రభుత్వం జీవో ఇవ్వనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బతుకమ్మకు ప్రతి జిల్లాకు రూ.30లక్షల చొప్పున నిధులు కేటాయించనున్నది. మిగిలిన నిధులను గ్రేటర్ హైదరాబాద్లో నిర్వహించే వేడుకలకు వినియోగించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. ఈ నెల 21నుంచి 30వరకు బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: Telangana Govt: సీబీఐ విచారణపై జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇక వేటు తప్పదా..?
వరంగల్లోని వేయిస్తంభాల గుడి
తెలంగాణ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో చాటాలనే సంకల్పంతో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించేందుకు పర్యాటకశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. వరంగల్లోని వేయిస్తంభాల గుడిలో ఈ నెల 21న బతుకమ్మ సంబురాలను అధికారికంగా ప్రారంభిస్తున్నారు. ఈ నెల 28న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో 10 వేల మంది మహిళలతో బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించేలా జీహెచ్ఎంసీ ఈ వేడుకను నిర్వహించనున్నది. గ్రేటర్ హైదరాబాద్లోని 11 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నది.
29న పీపుల్స్ ప్లాజాలో ఉత్తమ బతుకమ్మ పోటీలు
ఈ వేడుకకు హాజరయ్యే మహిళలకు ప్రత్యేక ట్యాగ్లు కేటాయించనున్నట్లు సమాచారం. 27న హైదరాబాద్లో ట్యాంక్ బండ్ వద్ద సాయంత్రం బతుకమ్మ కార్నివాల్, హుస్సేన్సాగర్లో ‘ఫ్లోటింగ్ బతుకమ్మ’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది. 29న పీపుల్స్ ప్లాజాలో ఉత్తమ బతుకమ్మ పోటీలు, 30న ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, ఫ్లోరల్ హోలీ, 28న బతుకమ్మ సైకిల్ రైడ్, 29న మహిళల బైకర్స్ రైడ్, 30న విన్టేజ్ కార్ ర్యాలీ నిర్వహించనున్నారు.30న ట్యాంక్బండ్ వద్ద గ్రాండ్ పూల పండుగ నిర్వహించనున్నారు. తెలంగాణ చేతివృత్తుల కళాఖండాల ప్రదర్శన, నెక్లెస్ రోడ్డులో మూడురోజుల పాటు తెలంగాణ వంటకాలతో స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మహిళా సంఘాలకు చీరలు?
మహిళా సంఘాల్లోని సభ్యులకు ప్రభుత్వం ప్రతీ ఏటా రెండు చీరలు అందజేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అందుకోసం ఏటా 64లక్షల చీరలు అవసరం అని, అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఏటా రెండుసార్లు పంపిణీ చేయనున్నారు. అయితే మహిళలకు బతుకమ్మ ప్రత్యేక పండుగ కావడంతో అదే రోజూ పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అందుకోసం 32లక్షల చీరలు అవసరం అవుతాయి. ఇప్పటికే 80శాతం చీరలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరో 20శాతం చీరలను సైతం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అవికూడా కంప్లీట్ అయితే త్వరలోనే తేదీని సైతం ప్రకటించే అవకాశం ఉంది. చీరలు పంపిణీచేస్తే ప్రభుత్వానికి మైలేజ్ రావడంతో పాటు స్వయం సహాయక సంఘాల్లో ఇప్పటివరకు చేరని వారిని సైతం చేరేలా ప్రోత్సహించినట్లు అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ చీరల తయారీతో చేనేత కార్మికులకు ప్రభుత్వం ఉపాధిని సైతం కల్పించినట్లు అయింది.
Also Read: Viral Video: పులిని పట్టుకోని ఫారెస్ట్ అధికారులకు.. గ్రామస్థులు విచిత్రమైన శిక్ష!