MLC Jeevan Reddy: బీఆర్ఎస్, బీజేపీలు మిత్రపక్షాలని, ఒక పార్టీ కోసం మరో పార్టీ పని చేస్తున్నదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ మిత్రపక్షమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కాపాడుకోవడానికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సీబీఐ విచారణ కోరుతున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలని బీజేపీ నిరసన చూస్తే ఆశ్చర్యం వేస్తున్నదని తెలిపారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ కొమ్ముకాసిందని, బీఆర్ఎస్ ప్రచారం చేసిన సీట్లను పరిశీలిస్తే ఇది అందరికీ అర్థం అవుతుందని జీవన్ రెడ్డి వివరించారు. అందుకు ప్రతిఫలంగా కేసీఆర్ను కాపాడుకోవాలని బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టిందని చెప్పారు. కానీ, కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో నుంచి కాపాడటం ఎవరి తరం కాదని అన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో బీఎల్ సంతోష్ను కేసీఆర్ ఇరికించారని, అక్రమంగా ఆయనను అరెస్టు చేసే ప్రయత్నం చేసిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను ప్రస్తావిస్తూ.. ఈ కుట్ర కేసులో బీఎల్ సంతోష్ను ఇరికించారని చెబుతున్నారు కదా.. మరి ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆ పని చేయలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ను బీజేపీతమ అనుబంధ సంస్థగా మార్చుకుంటున్నదని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు ఇకనైనా ఆపాలని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటుతున్నదని, తమ పాలనలో కాళేశ్వరం మీద కేంద్ర బృందాలతో నివేదికలు తీసుకుంటున్నామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివరించారు. కాళేశ్వరం మీద జ్యుడీషియల్ కమిటీ వేసి విచారణకు తమ ప్రభుత్వం ఆదేశించిందని గుర్తు చేశారు. కాగా, కేంద్రంలోని బీజేపీ ఇప్పటికీ ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులతో కేసులు పెట్టించి, బెదిరించి ప్రజా ప్రతినిధులను వారి పార్టీలోకి చేర్చుకోవాలని కుట్రలు చేస్తూనే ఉన్నదని మండిపడ్డారు.
ఈ రోజు కిషన్ రెడ్డి, కే లక్ష్మణ్ సహా పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలాలు స్పష్టంగా నిందితుడిని వెల్లడిస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు వారిని అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.