KTR on CM Revanth: కాళేశ్వరంపై సీబీఐ విచారణ సాకుతో తెలంగాణ అస్తిత్వంపై చంద్రబాబు, మోడీలతో కలిసి రేవంత్ రెడ్డి(Revanth Reddy) భారీ కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. సీబీఐ పేరుతో కేసీఆర్, బీఆర్ఎస్ మీదనే దాడి జరగడం లేదన్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి మన గోదావరి జలాలను ఆంధ్రకు తరలించే కుతంత్రాలకు ఆ ముగ్గురు తెరతీశారని విమర్శించారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ గొంతుకగా ఉన్న కేసీఆర్(KCR), బీఆర్ఎస్(BRS) లను లేకుండా చేసి తెలంగాణపై తిరిగి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మోడీ, చంద్రబాబు ఎజెండా మేరకు బనకచర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి ఇక్కడి రైతుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు.
బీజేపీ దుర్వినియోగం
కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించడం అంటే ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టడమే అన్నారు. సీబీఐ(CBI), ఈడీ(ED), ఐటీ(IT) సంస్థలను మోదీ జేబు సంస్థలుగా విమర్శించిన రేవంత్ 48 గంటల్లోనే ఎందుకు మాట మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ వైపు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తుంటే రేవంత్ మాత్రం మోడీ ప్రాపకం కోసం వాటిని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(bandi sanjaey) కోరగానే అప్ప చెప్పడం ఆ రెండు పార్టీల సంబంధానికి సాక్ష్యం అన్నారు.
Also Read: Crime News: గంజాయి దందా చేస్తూ పట్టుబడ్డ సెక్యూరిటీ గార్డు.. ఎక్కడంటే..?
కాళేశ్వరం విచారణ
కేసీఆర్ పై విష ప్రచారం చేయాలన్న దుర్మార్గ ఆలోచనతో రేవంత్ ఉన్నాడని మండిపడ్డారు. తెలంగాణ ఏకైక గొంతుకగా నిలుస్తున్న కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని అణచివేసే కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొడుతుందన్నారు. సీబీఐ కే కాదు, ఏ ఏజెన్సీకి కాళేశ్వరం విచారణ అప్పచెప్పినా బీఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు. బీజేపీతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న ఈ కుట్రలను ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. న్యాయస్థానాల పైన తమకు సంపూర్ణ నమ్మకం ఉందని, అక్కడ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. బెదిరింపులు, కేసులు తమకు కొత్త కాదని, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలకైనా, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమే అని స్పష్టం చేశారు.