Bhudan Lands Scam: భూదాన్ భూముల అమ్మకాల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోర్జరీ పత్రాలతో భూదాన్ బోర్డుకు చెందిన భూములను విక్రయించిన ఇద్దరి ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ (ED) అధికారులు జప్తు చేశారు. ఇది భూములు కొన్న ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS) అధికారులతోపాటు మరికొందరు ప్రముఖుల్లో కలవరాన్ని కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారంలో 181, 182 సర్వే నెంబర్లలో 103 ఎకరాల భూదాన్ భూములు ఉన్నాయి. పాతబస్తీలో నివాసముంటున్న ఖదీర్ ఉన్నీసా అనే మహిళ తండ్రి ఈ సర్వే నెంబర్లలో ఉన్న 50 ఎకరాల భూమిని కొన్నేళ్ల క్రితమే భూదాన్ బోర్డుకు దానంగా రాసిచ్చారు.
భూమిని ప్లాట్లుగా మార్చి
అయితే, ప్రస్తుతం ఈ ప్రాంతంలో భూముల రేట్లు ఊహించని విధంగా పెరిగి పోయాయి. ఎకరం భూమి ధర కోట్లలో పలుకుతోంది. దాంతో 2021లో ఖదీర్ ఉన్నీసా ఆ భూమికి తానే వారసురాలినని పేర్కొంటూ తన పేర బదలాయించాలంటూ దరఖాస్తు చేసుకుంది. ఆ వెంటనే రెవెన్యూ అధికారులు కొందరు ఈ భూమిని ఖదీర్ ఉన్నీసా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఆ వెంటనే ఖదీర్ ఉన్నీసా మరికొందరితో కలిసి భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించింది. వీటిని కొన్నవారిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు కొందరు రాజకీయ నేతలు, ప్రముఖులు కూడా ఉన్నారు. కాగా, భూదాన్ భూములను అక్రమంగా అమ్ముకున్నారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా ముందుగా మహేశ్వరం పోలీసులు దీనిపై కేసులు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కూడా భూదాన్ భూముల అమ్మకాలపై కేసులు రిజిష్టర్ చేశారు.
Also Read: Wagah-Attari Border: పాక్ దౌర్భాగ్యం చూశారా.. ప్రకృతి కూడా ఆటపట్టిస్తోంది.. వైరల్ వీడియో
పాతబస్తీలోని ఖదీర్ ఉన్నీసా
భూదాన్ భూములు ఖదీర్ ఉన్నీసా పేరు మీద రిజిష్టర్ అయినపుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్న అమోయ్ కుమార్ కు నోటీసులు జారీ చేసి పలుమార్లు విచారించారు. కొందరు రెవెన్యూ అధికారులను కూడా ప్రశ్నించారు. అప్పటి ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు ఇచ్చి వారి నుంచి కూడా వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే పాతబస్తీలోని ఖదీర్ ఉన్నీసా నివాసంతోపాటు మునావర్ ఖాన్, సర్ఫాన్ తదితరుల నివాసాల్లో తనిఖీలు జరిపారు. విచారణలో భూదాన్ భూముల అమ్మకాల్లో అక్రమాలు జరిగినట్టుగా గుర్తించారు. ఈ క్రమంలోనే సోమవారం భూముల అమ్మకాల్లో కీలకంగా వ్యవహరించిన మునావర్ ఖాన్, అతని భార్య ఫైకా తహఖాన్ కు చెందిన బంజారాహిల్స్, శంషాబాద్, టోలీచౌకీ ప్రాంతాల్లో ఉన్న 4.80కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను జప్తు చేశారు.
Also Read: Suraksha Kavach: పోకిరీల ఆటలకు చెక్.. స్కూల్ పిల్లల కోసం సురక్ష కవచ్..!