ACB officials: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పట్టుబడుతున్న అవినీతి జలగలు
అవినీతి అధికారుల్లో ఏసీబీ దడ.. దూకుడు పెంచిన డీఎస్పీలు
నిత్యం ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న అవినీతి చేపలు
అక్రమ, అవినీతి సొమ్ముపైనే కొందరు అధికారుల ఫోకస్
మహబూబాబాద్, స్వేచ్ఛ: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు సూర్యాపేట జిల్లాలో అవినీతి అధికారులకు ఏసీబీ (ACB officials) దడ పట్టుకుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని వెలగబెడుతూ, అక్రమంగా సొమ్ము చేసుకునేందుకు అవినీతికి పాల్పడుతున్న అధికారుల భరతం ఏసీబీ అధికారులు పడుతున్నారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచోట అవినీతికి పాల్పడుతున్న అధికారులు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతూ ఏసీబీ వలలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఊడిపోయి, జీవిత గమ్యాన్ని ఎలా ఒడ్డుకు చేర్చాలో దిక్కుతోచని పరిస్థితుల్లో మగ్గుతున్నారు.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో దూకుడు
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల డీఎస్పీలు సాంబయ్య, వై.రమేష్లు.. అవినీతి అధికారులపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. అక్రమ ఆర్జన కోసం అర్రులు చాచి సామాన్య ప్రజల నుంచి దోచుకుంటున్న వారి భరతం పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని సబ్రిజిస్ట్రార్ అధికారిణి తస్లీమా నస్రిన్పై అవినీతి ఆరోపణలు రావడం, ఆమెపై ఫిర్యాదులు అందాయి. ఓ బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటూ అటెండర్తో పాటు ఏసీబీ అధికారులకు తస్లీమా నస్రిన్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాయి. ఇదే రీతిలో మహబూబాబాద్ రవాణా శాఖ అధికారి కారు డ్రైవర్, ముగ్గురు ఏజెంట్ల ద్వారా డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించిన గౌస్ పాషాను కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
Read Also- CM Revanth Reddy: ఏం కావాలో రాసి పెట్టుకోండి.. మీ వద్దకే వచ్చి జీవోలు ఇస్తా.. సీఎం బంపరాఫర్!
మరో ఘటనలో, అక్రమంగా బియ్యాన్ని వ్యాపారం చేస్తున్న ఓ వ్యాపారి నుంచి 2 లక్షల రూపాయల తీసుకుంటూ తొర్రూరు సీఐగా విధులు నిర్వహిస్తున్న అధికారి.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఓ సీఐ బాధితుడి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అతడిని ఏసీబీ కోర్టుకు రిమాండ్ చేశారు. ఇక, సింగరేణి కార్యాలయంలో ఓ బాధితుడి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటున్న అధికారిని సైతం ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. గత మూడు రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ సీఐ రాజేష్ కుమార్.. ఓ నల్ల బెల్లం వ్యాపారి నుంచి రూ.30 వేలు తీసుకొని ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.
దొరకాల్సిన వాళ్లు ఎక్కువమందే!
ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులే అడ్డదారులు తొక్కుతూ అక్రమ సంపాదనకు ఆశపడుతున్నారు. అందుకోసం అవినీతి దారులను వెతుక్కుంటున్నారు. సాఫీగా ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగించాల్సిన అధికారులు అడ్డదారుల్లో అక్రమంగా సంపాదించాలనే వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ శాఖల అధికారులపై ఏసీబీ అధికారులు దృష్టిసారించారు. అవినీతిని అంతమొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు బీజం పడడంతో నేటికీ అదే తీరు కొనసాగుతోంది. అయితే, ఇప్పటివరకు ఏసీబీ అధికారులకు దొరికిన అవినీతిపరులు కొంతమందేనని… ఇంకా చిక్కాల్సిన అవినీతి అధికారులు చాలామందే ఉన్నారని విస్తృతంగా చర్చ జరుగుతోంది. అడ్డదారులు తొక్కుతూ అవినీతికి పాల్పడి కటకటాలు లెక్కబెడతారా?, లేదంటే ప్రభుత్వ శాఖల్లో పని చేసే అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించి శభాష్ అనిపించుకుంటారా?, అనేది వేచిచూడాల్సిందే.
Read Also- Nagarkurnool: విహరిద్దామని భార్యను తీసుకెళ్లి.. నల్లమలలో సైలెంట్గా తగలబెట్టేశాడు!