Panula Jathara 2025: రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, ప్రజలకు ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక సదుపాయాల విస్తరణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘పనుల జాతర 2025’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ పనుల జాతర ప్రారంభం కానున్నది. ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు పంచాయతీ రాజ్(పంచాయతీ రాజ్(Panchayat Raj) గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) ప్రత్యేకంగా లేఖలు పంపారు. పల్లెల్లో ఉపాధి కల్పనతో పాటు గ్రామీణాభివృద్ధి పునాది బలపడేలా ఈ జాతర ఉపయోగపడుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, గ్రామాల్లో అభివృద్ధి కోసం ఇది ఒక పండుగ కావాలని ఆకాంక్షించారు. తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
గ్రామీణాభివృద్ధిలో కీలకం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం,(Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme)స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్), పంచాయతీరాజ్(Panchayat Raj) ఇంజినీరింగ్ శాఖ, గ్రామీణ మంచినీటి సరఫరా వంటి కీలక విభాగాల ద్వారా ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే పనులు ప్రారంభమవుతాయి. ఉపాధి హమీ నిధుల ద్వారా ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసా కింద పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, కాంపోస్ట్ గుంతలు, కోళ్ల ఫారాల నిర్మాణం, పొలం బాటలు వేయడం, నర్సరీల పెంపకం, జలనిధి పథకం కింద చెక్ డ్యాములు, ఊటకుంటల నిర్మాణాలను చేపడుతారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్లాస్టిక్ వెస్ట్ యూనిట్లు, సగ్రిగేషన్ షెడ్లు, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్లు, అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్లను నిర్మించనున్నారు. సీఆర్ఆర్, ఎంఆర్ఆర్ నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ రహదారుల నిర్మాణం, ఆర్ డబ్ల్యూఎస్ శాఖతో తాగునీటి సరఫరా పనులు ప్రారంభం కానున్నాయి.
వచ్చే ఏడాది మార్చి టార్గెట్
ప్రతి నియోజకవర్గంలో పనులను ఒకేసారి ప్రారంభించి 2026 మార్చి నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పనుల జాతరను చేపట్టనున్నది. ఇందులో చేపట్టే పనుల మొత్తం అంచనా వ్యయం రూ.2,199 కోట్లుగా ఉన్నది. ప్రణాళికాబద్దంగా పనులు పూర్తి చేసే కార్యాచరణను సిద్ధం చేసింది. ఈసారి పనుల జాతరలో ప్రత్యేకంగా ఇందిరా మహిళా శక్తి మహిళలకు ఉపాధి కల్పించే పనులు, వ్యవసాయ పొలాల బాటల నిర్మాణం, ఫల వనాలు, జల సంరక్షణ పనులు, భూగర్భ జలాలు పెంపొందించే పనులు, ఇంకుడు గుంతలు, గ్రామీణ మౌలిక వసతుల కల్పన, జీపీ, అంగన్వాడీ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణం, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం వంటి పనులు ఉంటాయి.
Also Read: Farmers Protest: గద్వాల జిల్లాలో యూరియా నిల్.. విసుగెత్తి రోడ్డెక్కిన రైతులు