CM Revanth Reddy: తెలంగాణలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగిన ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని జెండా వందనం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య హాట్ టాపిక్ గా ఉన్న జల వివాదం గురించి ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా గోదావరి జలాల్లో తమ వాటా విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు.
‘కుట్రలను తిప్పికొడతాం’
తెలంగాణలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ‘కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోం. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే.. శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా మన ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తోంది. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా.. ఆ ఎత్తులను చిత్తు చేస్తాం. దృష్టి మరల్చేందుకు సెంటిమెంట్ రగిలించాలన్న కొందరి కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుట్రలను ఛేదించి రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు సాధిస్తాం’ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ మన బలం: రేవంత్
తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మన బలం హైదరాబాద్. ప్రపంచ వేదికపై మన బ్రాండ్ హైదరాబాద్. ఈ బలాన్ని మరింత బ్రాండింగ్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించాం. అందుకే పలు అంతర్జాతీయ ఈవెంట్లను హైదరాబాద్ లో నిర్వహించేలా నిర్ణయాలు తీసుకున్నాం. ఇటీవల 72వ ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ వేదిక అయ్యింది. దీంతో మన చారిత్రక కట్టడాలను, వారసత్వ సంపదను ప్రపంచ దేశాలకు చూపించే అవకాశం కలిగింది. దేశంలోనే మొదటి సారి గత ఏడాది హైదరాబాద్ లో వరల్డ్ గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) సదస్సు నిర్వహించాం. భారత్ ఫ్యూచర్ సిటీలో AI సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నాం. గ్లోబల్ రైస్ సమ్మిట్ ను కూడా మనం హైదరాబాద్ లో నిర్వహించుకున్నాం. మన ప్రభుత్వం నిర్వహించిన బయోఏషియా సదస్సుకు 50 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అంతర్జాతీయ రాజకీయ సదస్సు భారత్ సమ్మిట్ – 2025 ను మనం హైదరాబాద్ లో నిర్వహించాం. ఈ అన్నీ వేదికల నుండి మనం తెలంగాణ విజన్ ను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేశాం. అదే “తెలంగాణ రైజింగ్ – 2047”. వచ్చే డిసెంబర్ లో ఈ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించబోతున్నాం’ అంటూ రేవంత్ చెప్పుకొచ్చారు.
Also Read: Modi Employment scheme: ప్రధాని గుడ్ న్యూస్.. యూత్ కోసం రూ. లక్ష కోట్లతో కొత్త పథకం.. వివరాలు ఇవే!
‘2047 నాటికి గేమ్ ఛేంజర్లా తెలంగాణ’
2047 నాటికి స్వతంత్ర భారతం శత వసంతాలు పూర్తి చేసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్నదే మా సంకల్పం. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్ 2047’. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు.. ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం. ఇది యావత్ తెలంగాణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్. మూసీ పునరుజ్జీవం నుంచి మొదలై గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ఈ విజన్ లో విస్పష్టంగా ఉండబోతోంది. వరదలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ ను.. స్వచ్ఛమైన, సుందరమైన నగరంగా మార్చే సంకల్పాన్ని ఈ విజన్ ఆవిష్కరిస్తుంది’ అని రేవంత్ అన్నారు.