BJP Telangana strategy: నెలకొకరిని చేర్చుకునేలా వ్యూహం
శ్రేణుల్లో జోష్ నింపేందుకు ఒక్కొక్కరిగా ఆహ్వానం
జాయినింగ్స్పై ఫుల్ కాన్ఫిడెంట్గా కమలం పార్టీ
ఒకేసారి చేర్చుకుంటే కొద్దిరోజులే ప్రభావం
నెలకొక్కరు చొప్పున చేర్చుకుని నిత్యం వార్తల్లో నిలిచేలా ప్లాన్
బీఆర్ఎస్ను క్రమంగా డిమోరల్ చేయాలన్నదే వ్యూహం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, వరుస అనూహ్య పరిణామాలతో ఢీలాపడిన బీఆర్ఎస్ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టార్గెట్గా చేసుకున్న విషయం తెలిసిందే. మొయినాబాద్ ఫాంహౌజ్ ఎమ్మెల్యే కొనుగోళ్ల కేసులో బీజేపీని ట్రాప్ చేసి ఇరుకున పెట్టడంతో కాషాయ పార్టీ ‘ప్రతీకార ప్లాన్’ (BJP Telangana strategy) చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆ కేసులో ప్రమేయం ఉన్నవారిని ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకునే పనిలో కమలదళం నిమగ్నమైందని సమాచారం. ఇప్పటికే ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగులో కేసులో ఒకరైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పార్టీలో చేర్చుకుంది. అంతటితో ఆగకుండా ఇతరులను కూడా లాక్కునే పనిలో పడినట్లుగా విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి గువ్వల బాలరాజుతోపాటే మిగతా మాజీలను సైతం పార్టీలో చేర్చుకుంటారని అంతా భావించారు. కానీ, అలా కాకుండా ఒక్కొక్కరిగా చేర్చుకోవాలని పార్టీ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
Read Also- Allu Aravind: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్
తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కమల దళం ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. కాగా, ఎవరు ఏం అనుకున్నా బీజేపీ మాత్రం ఈ అంశంపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆచితూచి వ్యవహరించేలా లెక్కలు వేసుకుంటోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చేరతారని లీకులు కూడా వస్తున్నాయి. అయితే, వారెవరూ ఇప్పటి వరకు చేరలేదు. అయినప్పటికీ కమలనాథులు చేరికలపై చాలా నమ్మకంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎవరేం అనుకున్నా తమ వ్యూహం తమకు ఉందనే ధీమా వారిలో కనిపిస్తోంది. అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా చెబుతున్నారు. చేరేవారి క్యూ ఇంకా ఉందని కమలనాథులు ధీమాగా అంటున్నారు.
Read Also- HYDRA: కీలక ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ పర్యటన.. ఎందుకంటే?
బీజేపీ టార్గెట్ ఇదే
తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఎదగాలనే ధోరణితో బీజేపీ ఉంది. బీఆర్ఎస్కు సెకండ్ ప్లేస్ లేకుండా చేసి ఆ స్థానాన్ని భర్తీ చేయాలని కషాయ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఒక్కొక్కరుగా చేర్చుకోవాలని యోచిస్తోంది. ఒకేసారి నలుగురైదుగురు కీలక నేతలు చేరినా ఆ ప్రభావం మహా అయితే నెల రోజులు ఉంటుందని, అప్పటివరకే నేతల్లో జోష్ ఉంటుందని రాష్ట్ర నాయకత్వం లెక్కలు వేస్తోంది. అదే నెలకొక్కరు చొప్పున చేర్చుకుంటే ఆ ఇంపాక్ట్ ఎక్కువ రోజులు ఉండటంతో పాటు శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు చేసేందుకు పనికొస్తుందనే యోచనలో పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా, బీఆర్ఎస్ను క్రమంగా డీమోరల్ చేయడంతో పాటు కాంగ్రెస్కు సైతం ఈ జాయినింగ్స్తో డిఫెన్స్లో పడేయవచ్చనే పక్కా వ్యూహంతో కాషాయ పార్టీ ప్లాన్ చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే నెలకొక్కరు చొప్పున చేర్చుకుంటూ నిత్యం వార్తల్లో ఉండొచ్చనేది మరో వ్యూహంగా కనిపిస్తోంది. బీజేపీ వ్యూహాన్ని పసిగట్టి బీఆర్ఎస్ అలర్ట్ అవుతుందా? లేక, కమలం పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యూహంలో పడి చిత్తవుతుందా? అనేది చూడాలి మరి.
