Ramchender Rao: రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలకు బీజేపీ(BJP) సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchender Rao) ఒక ప్రకటనలో తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువులు, డ్రైన్ల వద్దకు వెళ్లకూడదని సూచించారు. పిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వాతావరణ కేంద్రం హెచ్చరించిన ప్రకారం హన్మకొండ(Hanmakonda), జనగాం, మహబూబాబాద్(Mehabubabad), వరంగల్(Warangal), భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్, కొత్తగూడెం(Kothagudem), హైదరాబాద్(Hyderabad), భూపాలపల్లి(Bhupala Pally), కరీంనగర్(Karemnagar), మల్కాజ్గిరి, పెద్దపల్లి, రంగారెడ్డి(Rangareddy), సిద్ధిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్(Orange Alert), ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయన్నారు. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు మునిగిపోవడం, ట్రాఫిక్ అంతరాయం, మురుగు నీటి ఉప్పొంగడం, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో
అత్యవసర పరిస్థితులు గమనించిన వెంటనే ప్రభుత్వ హెల్ప్లైన్ లేదా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా సహాయక చర్యలకు సిద్ధంగా ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఆహారం, తాగునీరు(Food) పంపిణీ, వైద్య సహాయం, వృద్ధులు, చిన్నపిల్లలకు సహకరించడం వంటి కార్యక్రమాల్లో బీజేపీ కార్యకర్తలు పాల్గొనాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో జాతీయ విపత్తు సహాయ బలగాలతో సమన్వయం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించడం కర్తవ్యమని, అందరూ ఒకరికొకరు అండగా నిలవాలన్నారు.
Also Read: TG Rains: బిగ్ అలెర్ట్.. మరో 4 రోజులు దంచుడే దంచుడు.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్త!
ఇంటిపై త్రివర్ణ పతాకం
ఇదిలా ఉండగా హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో హర్ ఘర్ తిరంగా వేడుకలకు ముఖ్య అతిథిగా రాంచందర్ రావు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలందరూ విద్యాసంస్థలు, కాలనీలు, ఇండ్లలో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురేయాలని కోరారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా దేశభక్తి భావనతో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గురువారం ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్డుపై జరిగే తిరంగా యాత్రకు కుల, మత, ప్రాంతాలకతీతంగా వేలాదిగా ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ తదితరులు హాజరయ్యారు.
అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకురావాలని రాంచందర్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడులు, హత్యలు ఆగాలంటే ఈ చట్టం తప్పనిసరిగా అమల్లోకి రావాలన్నారు. వామన్ రావు దంపతుల హత్య వంటి ఘోర సంఘటనలు మళ్లీ జరగకుండా, న్యాయవాదుల భద్రతను కాపాడే చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. న్యాయవాదుల గౌరవం, భద్రత కోసం బీజేపీ పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. వామన్ రావు దంపతుల హత్య కేసులో సుప్రీం కోర్టుతీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. విచారణను వెంటనే సీబీఐకి అప్పగించాలన్నారు.
Also Read: Betting Apps Case: బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హాజరైన మంచు లక్ష్మీ ప్రసన్న