Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ మరికొద్దిసేపట్లో సిట్ విచారణ (SIT Probe)కు హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ లోని తన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించిన బండి.. కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ను మెుదట బయటపెట్టింది తానేనని బండి అన్నారు. విచారణకు హాజరుకావాలని గత వారమే నోటీసులు వచ్చాయని.. పార్లమెంటు సమావేశాల కారణంగా వెళ్లలేకపోయినట్లు చెప్పారు.
‘సిట్కు స్వేచ్ఛ లేదు’
అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt), సిట్ అధికారులపై తనకు నమ్మకం లేదని బండి అన్నారు. సిట్ అధికారులకు రాష్ట్రప్రభుత్వం ఏమాత్రం స్వేచ్ఛ ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫ్యామిలీ ఒక్కరిని కూడా ఇప్పటివరకూ అరెస్ట్ చేయాలని పేర్కొన్నారు. కాబట్టి సీబీఐకి కేసును అప్పగిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని బండి అభిప్రాయపడ్డారు.
ఆధారాలతో బయటపెడతా
ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తన వద్ద ఉన్న మెుత్తం సమాచారాన్ని ఆధారాలతో సహా సిట్ అధికారులకు అందజేస్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు. బాధ్యత గల పౌరుడిగానే సిట్ విచారణకు వెళ్తున్నట్లు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేసిందని బండి ఆరోపించారు. ప్రజా సమస్యలపై కొట్లాడుతుంటే తనను దెబ్బతీయాలని చూశారని అన్నారు. మిగిలిన విషయాలను సిట్ విచారణ అనంతరం మాట్లాడతానని బండి స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది?
సిట్ విచారణకు హాజరైన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (Special Operations Team)ను ఏర్పాటు చేశారు. డీఎస్పీ ప్రణీత్ రావు (D. Praneeth Rao), ఏఎస్పీ మేకల తిరుపతన్న (Mekala Thirupathanna), ఎన్. భుజంగరావు (N. Bhujanga Rao), రాధా కిషన్ రావు (Radha Kishan Rao) లను కలిపి ఒక టీమ్ గా ఫామ్ చేశారు. అయితే మావోయిస్టులపై నిఘా కోసం ఉపయోగించే సాధనాలను ఈ SOT టీమ్.. రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి.
రేవంత్, బండి ఫోన్ ట్యాపింగ్!
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) విజయమే లక్ష్యంగా ప్రభాకర్ రావు ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (Special Operations Team) టీమ్ పని చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకున్న అధునాతన సర్వైలెన్స్ సాధనాలను అప్పటి విపక్ష నాయకులు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సహా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నాయకుల ఫోన్ ను అక్రమంగా వారు ట్యాపింగ్ చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. అలాగే రాష్ట్రంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, ఎన్నికల్లో విపక్ష పార్టీలకు మద్దతిచ్చే వ్యక్తుల ఫోన్లను సైతం SOT ట్యాప్ చేసినట్లు సిట్ తన ఎఫ్ఆర్ఐలో పేర్కొంది.
Also Read: Viral Video: ‘మా నాన్న సూపర్ హీరో’.. చాటి చెప్పిన బాలికలు.. ప్రతీ తండ్రి గర్వపడే వీడియో!
ట్యాపింగ్ డేటాతో బెదిరింపులు
ఫోన్ టాపింగ్ ద్వారా సేకరించిన డేటాను ఎస్ఓటీలో భాగమైన డీఎస్పీ ప్రణీత్ రావు.. అక్రమంగా ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారవేత్తల వ్యక్తిగత విషయాలను అడ్డుపెట్టుకొని పెద్ద ఎత్తున డబ్బు దోచుకున్నట్లు వార్తలు వచ్చాయి. కొందరు వ్యాపారులను బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధులు కూడా సేకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఏకంగా 36మంది వ్యాపారవేత్తలను ప్రణీత్ రావు బెదిరించి డబ్బు తీసుకున్నట్లు సిట్ బృందం గుర్తించినట్లు సమాచారం. అంతేకాదు ఎస్ఓటీ బృందాన్ని దాటి కూడా ఫోన్ ట్యాపింగ్ సమాచారం కిందస్థాయి సిబ్బందికి వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. నల్గొండలో ఒక కానిస్టేబుల్.. 40మంది మహిళలను బ్లాక్ మెయిల్ చేసిన ఉదంతం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.