BC Reservations: రెండో సారి కాంగ్రెస్ నిరసనలు
బీసీ 42 రిజర్వేషన్ల సాధింపునకు పట్టు
రాహుల్, రేవంత్ , మంత్రులు హాజరు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బీసీ రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రెండోసారి ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఒకసారి ధర్నా నిర్వహించిన హస్తం పార్టీ.. మరో ప్రయత్నంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగనున్నది. బుధవారం ఉదయం (ఆగస్టు 6) ధర్నా ప్రారంభం కానుంది. ఈ ధర్నాలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ , మంత్రులు, బీసీ సంఘాల నాయకులు, కేంద్రంలోని ప్రతిపక్ష ఎంపీలు, తదితరులు పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా వివిధ బీసీ సంఘాల నాయకులు కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది.
ఈ ధర్నాలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు కీలక నాయకులు తెలంగాణ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ప్రత్యేక రైళ్లు, ఫ్లైట్స్లో నేతలు హస్తినబాట పట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు , కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ఫ్రంట్ వింగ్ అధ్యక్షులంతా ఢిల్లీ బాట పట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ప్రత్యేక ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. ఈ దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీలోనే నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్న సమయంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం గమనార్హం. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో జరుగుతున్న ఈ ధర్నా ప్రభావం ప్రబలంగానే ఉంటుందనేది కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే, 42 శాతం రిజర్వేషనపై పట్టువీడకుండా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.
Read Also- Trump on India: భారత్పై మరోసారి విషం కక్కిన డొనాల్డ్ ట్రంప్.. 24 గంటల్లో..
హామీకి అనుగుణంగా అడుగులు..
ఎంత జనాభా ఉంటే అంత వాట అనే నినాదాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ‘జోడో యాత్ర’లో ప్రకటించారు. మరోవైపు, ఇచ్చిన హామీను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. అన్ని విధాలుగా సక్సెస్ అయ్యేందుకు బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్లాన్తో ముందుకు సాగుతోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే చేపట్టి.. ఆ లెక్కల ఆధారంగా రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. వాటికి ఆమోదముద్ర వేయించాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అయితే, రాష్ట్ర శాసనసభలో బీసీ రిజర్వేషన్ల బిల్లులకు మద్దతు పలికిన బీజేపీ నాయకులు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా ముస్లింలను సాకుగా చూపి భావోద్వేగ రాజకీయాలకు తెరలేపుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జంతర్ మంతర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ధర్నా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా ఈ రిజర్వేషన్లు సాధ్యపడదు అంటూ ప్రకటించారని కాంగ్రెస్ నాయకులు ఇరకాటంలో పెడుతున్నారు. దీంతో, బీసీ రిజర్వేషన్ల సాధనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగే పోరుకు విపక్షాల ఇండియా కూటమిలోని సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, వామపక్షాలు, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) తదితర పార్టీల నాయకులను భాగస్వామ్యం చేయనున్నారు.
Read Also- TS News: ఖమ్మం కలెక్టరేట్లో డ్రైవర్.. ఎవరూ ఊహించని పనులు!