Bhatti Vikramarka: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో రాజుగారి కోట దగ్గర ఏర్పాటుచేసిన నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రాలను ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ అలీ ఫరూఖీ, మంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపనల చేశారు. రూ.65.67 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 7 విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిర్మాణాల పట్టాలు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు.
ఎందుకు ఆలోచన చేయలేదు
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే అధికారాన్ని ప్రజలకు ఇచ్చాం ప్రజల ఆలోచనలే మా ఎజెండాగా పనిచేస్తున్నామని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పై ప్రాంతంలో తెలంగాణ భూభాగంలో ఒక డ్యామ్ కడితే పెద్ద ఎత్తున కృష్ణ నీటిని తీసుకునే అవకాశం ఉన్న నాటి ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయలేదని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగవంతం చేశామని తెలిపారు. పర్యాటక రంగంలో తెలంగాణ ప్రపంచాన్ని ఆకర్షించేలా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కృషి చేస్తున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అప్పుల భారం ఉన్నప్పటికీ వాటిని అధిగమించి గత ప్రభుత్వ పెద్దలు చేసిన అప్పులకు 6,500 కోట్లు ప్రతినెల వడ్డీ కడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల మొదటి తేదీనే జీతాలు ఇస్తున్నామని అన్నారు.
Also Read: Mana Ooru Mana tourism: ప్రతీ జిల్లాలో టూరిజం ప్రాంతాల అభివృద్ధి, ప్రమోట్ చేసేలా కసరత్తు!
రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు
ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజల సంక్షేమం కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు డిప్యూటీ సీఎం వివరించారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 10 లక్షలకు పెంచాంమని ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు 200 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణం చేశారని ఈ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం 6680 కోట్లు మహిళల పక్షాన ఆర్టీసీకి చెల్లించిందని తెలిపారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా పేదలకు 5 లక్షలతో ఒక్కో ఇంటిని నిర్మిస్తున్నాం ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు మొదటి దశలో నిర్మించేందుకు 22,500 కోట్లు ఖర్చు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వడివడిగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నాం గత పది సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు పేదలకు పంచలేదు అని డిప్యూటీ సీఎం వివరించారు.
ఐటీఐ కాలేజీలు ఏర్పాటు
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేష్ రాష్ట్రం పోతిరెడ్డిపాడు కాల్వ ద్వారా కృష్ణా జలాలను ఇప్పటికే భారీగా తరలించుకుపోతున్నదని, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణతో మన ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరగనుందని, శ్రీశైలం రిజర్వాయర్ లోని నీళ్లు రెండు మూడు నెలల్లోనూ ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత నీటీ సమస్య తీరాలంటే వెల్టూరు, చిన్నమర్రి మధ్య కృష్ణ నదిపై డ్యాం నిర్మించాల్సిన అవసరం ఉందని, ఒక్క ఎకరం ముంపు ముప్పు లేకుండా సుమారు 60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, మీ సాకారం కూడా కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కను కోరారు. ఇక్కడ డ్యాం నిర్మాణం వల్ల నాగరర్ కర్నూల్ జిల్లాతో పాటు నార్లాపూర్ మోటర్లు, కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా చేపట్టిన ఎల్లూర్ లిప్ట్, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ లకు కూడా నీటిని వినియోగించుకోవచ్చని తెలిపారు. కొల్లాపూర్లో విద్యాభివృద్ధికి ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
Also Read: Banakacherla: బనకచర్ల రాజకీయం.. మళ్లీ మొదలు!
50 గ్రామ లైబ్రరీలను ఏర్పాటు
మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధిలో ముందుకు సాగుతుందని అన్నారు. కొల్లాపూర్ నియోజక వర్గంలో దాదాపుగా 100 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులను ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 50 గ్రామ లైబ్రరీలను ఏర్పాటు చేయడం జరిగిందని అందులో వారు లైబ్రరీలను కొల్లాపూర్ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పదో తరగతి విద్యార్థుల కోసం కోటి రూపాయలతో డిజిటల్ రూపంలో రూపొందించిన వర్క్ బుక్ను రూపొందించడం జరిగిందని, పార్లమెంట్ పరిధిలో పది నూతన బ్యాంకులను నెలకొల్పనున్నట్లు తెలిపారు. పార్లమెంట్ పరిధిలో ప్రజలకు అవసరమైన పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఆర్టీసీ ప్రయాణానికి 6680 కోట్ల
అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి 6680 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్టిసి కి చెల్లించిందని, తద్వారా ప్రజలకు, ఆర్టీసీతో పాటు ప్రభుత్వానికి లాభం చేకూరిందని తెలిపారు. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ప్రభుత్వం అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, డిసిసిబి చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం గద్వాల మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య, సంబంధిత శాఖల అధికారులు, కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు .
Also Read: TSIIC: ఇచ్చిన హామీలు అమలైతేనే భూములు వదులుతాం.. రైతుల నిరసన