KTR:
ఎవరితో కలిసే ప్రసక్తే లేదు
తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ
పాలిచ్చే బర్రెను పక్కనబెట్టి తన్నే దున్నపోతును తెచ్చుకున్నరు
కేసీఆర్ మరోసారి సీఎం అయ్యాక మన కష్టాలు పోతాయ్
హనుమకొండలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
వరంగల్, స్వేచ్ఛ: తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, ఎట్టి పరిస్థితిలోనూ ఎవరితో కలిసే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల లలితా కన్వెషన్ హాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘గిప్ట్ ఏ స్పైల్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ చేతుల మీదుగా మహిళలకు కుట్టు మిషన్లు, బాలింతలకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు యుద్ధమే చేయాల్సి వస్తోందని ఆరోపించారు. నల్లబెల్లిలో మహిళా రైతుపై నాన్-బెయిలబుల్ కేసు పెట్టారని పేర్కొన్నారు. అనేక సంక్షేమ పథకాలు అటకెక్కించారని ఆరోపించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనా కాలంలో కరోనా సంక్షోభం వచ్చినా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదన్నారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యాక కష్టాలు పోతాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
గతంలో బీసీలకు న్యాయం చేసింది, రేపు కూడా బహుజనులకు న్యాయమైన వాటా ఇచ్చేది బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ అన్నారు. నిన్నైనా, రేపైనా బీసీలకు న్యాయం చేసేది కేసీఆర్ ఒక్కరే అని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను బంపర్ మెజార్టీతో గెలిపించాలన్నారు. పరకాల నియోజకవర్గంలో ఉన్న 55 ఎంపీటీసీల్లో 58వ శాతం టికెట్లను అంటే 32 ఎంపీటీసీ స్థానాలను గతంలో బీసీ సోదరులకు ఇచ్చామని ప్రస్తావించారు. అంతేకాదు, 109 సర్పంచులలో 49 శాతం అంటే సుమారు 49 స్థానాలను బీసీలకు ఇవ్వడంతో పాటు ఆరు జడ్పీటీసీల్లో 3 స్థానాలు, 6రు ఎంపీపీలో 3 స్థానాలను బహుజనులకే కేటాయించామని కేటీఆర్ ప్రస్తావించారు.
Read Also- Shubman Gill: గిల్ సూపర్ సెంచరీ.. చెరిగిపోయిన దిగ్గజాల రికార్డులు
తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేలు బాకీ పడిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చారాణ కోడికి బారాణ మసాలా అన్నట్టు స్వయం సహాయక బృందాలకు రూ.3000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.300 కోట్లు ఇచ్చి సంబరాలు చేసుకోమంటున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులకు సమ్మక్క- సారక్క, రాణి రుద్రమ వారసురాళ్లు అయిన వరంగల్ ఆడబిడ్డలు ప్రశ్నించాలన్నారు. పార్లమెంటు ఎన్నికలప్పుడు రైతుబంధు వేసి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయని మళ్లీ రైతుబంధు వేశారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ కండువా కప్పుకుని వచ్చే బీఆర్ఎస్ క్యాడర్ను కేసీఆరే వచ్చినట్టుగా భావించి కడుపులో పెట్టుకొని ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనవరిలోనే ఎరువులు కొని బఫర్ స్టాక్ చేసుకునే పరిస్థితి ఉండేదన్నారు.
Read Also- Thai Vs Cambodia: ట్రంప్ చెప్పినా తగ్గని థాయ్లాండ్, కాంబోడియా
ఆజం జాహీ మిల్లు మూతపడడంతో వరంగల్ జిల్లాలోని పద్మశాలీలు బతుకుదెరువు కోసం భీమండి, సూరత్, షోలాపూర్ వలస పోయారని కేటీఆర్ అన్నారు. ‘‘అలా వలసపోయిన వాళ్లందర్నినీ తిరిగి స్వరాష్ట్రానికి తెప్పించుకుంటామని ఉద్యమ కాలంలో కేసీఆర్ చెప్పారు. అందుకు అనుగుణంగానే తెలంగాణ వచ్చాక ఇదే వరంగల్ గడ్డపై 1500 ఎకరాల్లో భారతదేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ది, పట్టుదల, నిజాయితీ కారణంగా కేరళకు చెందిన కీటెక్స్ సంస్థ రూ.2,400 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టింది’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.